Araku Valley| అరకు లోయలో పర్యాటకుల తాకిడి..మీరు వెళ్లండి!

క్రిస్మస్ సెలవులు..న్యూ ఇయర్ వేళ పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని పాపి కొండలు టూర్, అరకు టూర్ లకు సందర్శకుల రద్ధీ పెరిగింది. అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, వంజంగి వ్యూపాయింట్ ప్రాంతాలకు భారీగా పర్యాటకులు చేరుతున్నారు. ఈ ట్రెండ్ సంక్రాంతి పండుగ వరకు కొనసాగే అవకాశం ఉంది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Apr 04, 2026, 1:20 pm IST
Read Time: 6 mins
Araku Valley| అరకు లోయలో పర్యాటకుల తాకిడి..మీరు వెళ్లండి!

(వై. వెంకటనరసింహారెడ్డి)

క్రిస్మస్ సెలవులు..న్యూ ఇయర్ వేళ పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని పాపి కొండలు టూర్, అరకు టూర్ లకు సందర్శకుల రద్ధీ పెరిగింది. అరకు(Araku Valley), పాడేరు, లంబసింగి, చింతపల్లి, వంజంగి వ్యూపాయింట్ ప్రాంతాలకు భారీగా పర్యాటకులు చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వెలుతున్నారు. దట్టమైన పొగమంచు అందాలను, పచ్చదనంతో కూడిన కొండలు..లోయల సోయగాలను వీక్షించి ఆస్వాదించడానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు.

తాజాగా అరకు లోయలో వీకెండ్ వేళ..పర్యాటకు రద్దీ (tourist rush) పెరిగిన క్రమంలో శనివారం రాత్రి నుంచి ఘాట్ రోడ్డులపై కిలోమీటర్ల మేర వాహనాల ట్రాఫిక్ నిలిచి పోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. వంజంగి వ్యూపాయింట్ వద్ద సందర్శకులు కిక్కిరిశారు. ఉడెన్ బ్రిడ్జి వద్ద రద్దీ పెరిగిపోవడంతో బ్రిడ్జిని మూసివేసి..సమీపంలోని దుకాణాలను క్లోజ్ చేశారు. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలని వస్తున్న పర్యాటకులకు రద్దీ పెరిగి తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

హోటల్స్ హౌస్ ఫుల్స్

విశాఖ అరకు, పాడేరులలోని హోటల్స్ అన్ని హౌస్ ఫుల్ అయిపోయాయి. పెరిగిన పర్యాటకుల సంఖ్య నేపథ్యంలో ఉడెన్ బ్రిడ్జి సందర్శన వేళలను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పరిమితం చేశారు. ప్రస్తుత రద్దీలో ముందస్తుగా రిజర్వేషన్లతో ప్లాన్ చేసుకున్న వాళ్లకి అయితే వసతులు, బసకు ఇబ్బంది ఉండదని..నేరుగా వెళితే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు. హోటల్స్, రిసార్ట్స్ దగ్గర డిమాండ్ ఆధారంగా ధరలు పెంచేసి టూరిస్టులను దోచుకుంటున్నారు. వసతి దొరుకక..పర్యాటకులు ప్రధాన రహదారులపై చలి మంటలు కాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు టెంట్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. టూరిస్టులతో అరకు కిరండూల్ ప్యాసింజర్ రైలు కిటకిటలాడుతోంది. కనీసం నిలబడడానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొంది. ఈ ట్రెండ్ సంక్రాంతి పండుగ వరకు కొనసాగే అవకాశం ఉంది.

ఆంధ్రా ఊటీ..అరకు బ్యూటీ

ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు, వంజంగి మేఘాల పర్వత ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. కొండ పైకి వెళ్లి ప్రకృతి అందాల మధ్య సూర్యోదయం ఆస్వాదించడానికి పోటీ పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు ఎక్కడ చూసిన పర్యాటకుల రద్దీ కనిపిస్తుంది. బొర్రా గుహలు, కటికి, తాడిగూడ జలపాతాలు, అరకు లోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియమ్‌, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాలకొండ ప్రాంతాల్లో పర్యాటకులతో రద్దీ కొనసాగుతుంది.