Cheteshwar Pujara : భారత క్రికెటర్(Indian Cricketer) చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు చతేశ్వర్ పుజారా ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు తన రిటైర్మెంట్ పోస్టు పెట్టాడు. భారత టెస్టు క్రికెట్(Test Cricket)లో రాహుల్ ద్రవిడ్ తర్వాతా టెస్టు క్రికెట్ స్పెషలిస్టుగా.. నయా వాల్ గా పేరొందిన పుజరా జట్టు కోసం ఎన్నో విలువైన ఇన్నింగ్స్ లు ఆడాడు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పుజారా103 టెస్టులు, 5 వన్డేలు ఆడారు. టెస్టు క్రికెట్ లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 7,195 పరుగులు చేశాడు. ఐదు వన్డేలు మాత్రమే ఆడిన పుజరా 51 పరుగులు చేశాడు. చివరిసారిగా భారత్‌ (Team India)తరఫున 2023లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు.

తన రిటైర్మెంట్ ప్రకటనలో చతేశ్వర్ పుజారా బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ కెరీర్‌ ఎదుగుదలకు తోడ్పాటు అందించిన ఫ్రాంచైజీ, కౌంటీ క్రికెట్‌ ప్రతినిధులకూ ధన్యవాదాలు వ్యక్తం చేశారు. నా మెంటర్‌లు, కోచ్‌లు, ఆధ్యాత్మిక గురువు.. ఇలా ప్రతి ఒక్కరూ నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సహచర క్రికెటర్లు, సపోర్ట్‌ స్టాఫ్‌, నెట్ బౌలర్లు, అనలిస్ట్‌లు, లాజిస్టిక్‌లు, అంపైర్లు, గ్రౌండ్ స్టాఫ్, స్కోరర్లు, మీడియా పర్సనల్, స్పాన్సర్లు, పార్టనర్స్‌, మేనేజ్‌మెంట్‌ సహకారం మరువలేనిదంటూ అందరిని స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులు, నా భార్య పూజ, నా కుమార్తె అదితి, స్నేహితులు.. ఇలా ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ అనంతరం నా కుటుంబం కోసం మరింత సమయం వెచ్చించేందుకు ప్రయత్నిస్తానని పుజారా వెల్లడించాడు.