heart-wrenching । ఇద్దరు పిల్లల మృతదేహాలను భుజాలపై వేసుకుని.. 15 కిలోమీటర్ల నడక (వీడియో చూడండి)

సకాలంలో చికిత్స అందక చనిపోయిన తమ ఇద్దరు కుమారుల మృతదేహాలను భుజాన మోస్తూ 15 కిలోమీటర్లు ప్రయాణించిన దంపతుల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

heart-wrenching । ఇద్దరు పిల్లల మృతదేహాలను భుజాలపై వేసుకుని.. 15 కిలోమీటర్ల నడక (వీడియో చూడండి)

heart-wrenching । ఏ తల్లిదండ్రులకూ రాకూడని కష్టం వారికి వచ్చింది. జ్వరంతో బాధపడుతున్న తమ ఇద్దరు పదేళ్లలోపు కొడుకులు సకాలంలో వైద్య సేవలు పొందలేని స్థితిలో చనిపోయారు. అదే కష్టం అనుకుంటే.. వారిద్దరి మృతదేహాలను ఇంటికి తీసుకుపోవడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదా పేద దంపతులకు. ఏం చేయాలో పాలుపోక.. చెరొక కొడుకు శవాన్ని భుజాన వేసుకుని.. స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్లారు. హృదయాలను కదలించి వేస్తున్న ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరీ తాలూకాలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  ఈ వీడియోను ప్రతిపక్ష నేత విజయ్‌ వాడెట్టివార్‌ పోస్టు చేశారు. పేద దంపతుల పరిస్థితిని చూసి నెటిజన్లు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వెలిబుచ్చారు. గడ్చిరోలి జిల్లా మంత్రిగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వ్యవహరిస్తున్నారు.

‘ఆ ఇద్దరు అన్నదమ్ములు జ్వరంతో బాధపడుతున్నారు. కానీ వారికి సకాలంలో చికిత్స అందలేదు. దాంతో కొన్ని గంటల్లోనే వారి ఆరోగ్యం విషమించింది. కాసేపటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు’ అని వాడెట్టివార్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఈ వీడియో పోస్టు చేస్తూ రాశారు. ఆ వీడియోలో.. యువ దంపతులు తమ ఇద్దరు కుమారుల శవాలను ఒక మట్టిరోడ్డు మీదుగా మోసుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది.

‘హాస్పిటల్‌ నుంచి మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ సదుపాయం లేదు. దీంతో ఆ దంపతులు తమ చిన్నారుల మృతదేహాలను తమ భుజాలపై మోసుకుంటూ మట్టిరోడ్డుపై నడుస్తూ 15 కిలోమీటర్ల దూరంలోని అహేరీ తాలూకా పట్టిగావ్‌కు చేరుకున్నారు’    అని వాడెట్టివార్‌ తన పోస్టులో తెలిపారు.

ఈ ప్రాంతంలో దయనీయ పరిస్థితికి అద్దంపడుతున్న ఈ ఘటనపై ఫడ్నవీస్‌, స్థానిక ఎన్సీపీ నేత, మంత్రి ధర్మారావు బాబా ఆత్రంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం గొప్పగా అభివృద్ధి సాధిస్తున్నదని వారిద్దరూ చెప్పుకొంటున్నారని, నిజానికి గడ్చిరోలిలో క్షేత్రస్థాయి పరిస్థితులు గమనిస్తే వారికి వాస్తవం తెలిసొస్తుందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.