విధాత, హైదరాబాద్ : సినీ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) బుధవారం ఈడీ విచారణ(ED Inquiry)కు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ (Betting Apps Promotion)కు సంబంధించిన కేసులో ప్రకాష్రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై గతంలో పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ విచారణ కొనసాగిస్తోంది. మొత్తం 29 మంది సినీనటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదు చేసింది. సినీ సెలబ్రేటీల ప్రమోషన్ల ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్లో డబ్బులు పెట్టి మోసపోవడంతోపాటు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు రూ.వేల కోట్ల డబ్బు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్ ల మోసాలపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆయా కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ఆరంభించింది. ప్రమోషన్లు చేసినందుకు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు హవాలా మార్గంలో పలువురికి డబ్బు పంపించారనే కోణంలో ఆరా తీస్తోంది. ఇప్పటికే తెలంగాణ పోలీసుల నుంచి ప్రాథమిక దర్యాప్తు వివరాలను ఈడీ సేకరించింది. రానా జులై 23న విచారణకు రావాలని గతంలో ఈడీ నోటీసు ఇవ్వగా ఆయన గడువు కోరారు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ సూచించింది. ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది.