Charlapalli Drugs Case| వాగ్ధేవీ కెమికల్స్ లో భారీగా డ్రగ్స్ తయారీ కెమికల్స్ సీజ్

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Sep 07, 2025, 6:36 pm IST
Read Time: 4 mins
Charlapalli Drugs Case| వాగ్ధేవీ కెమికల్స్ లో భారీగా డ్రగ్స్ తయారీ కెమికల్స్ సీజ్

విధాత, హైదరాబాద్ : చర్లపల్లి(Charlapalli Drugs Case)వాగ్ధేవీ కెమికల్స్ కంపెనీ(Vagdevi Chemicals) డ్రగ్స్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. అధికారులు రూ. 12 వేల కోట్ల విలువైన వివిధ రకాల డ్రగ్స్ తయారీకి వినియోగించే ముడి పదార్ధాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వాగ్దేవీ కంపెనీలో లారీల ద్వారా తరలించేందుకు నిల్వ చేసిన 200డ్రమ్ముల్లోని 35వేల లీటర్ల కెమికల్ రా మెటీరియ్ ను, 950కిలోల డ్రగ్ ఫౌడర్ ను, 5.79కిలోల మెఫిడ్రోన్‌, మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్‌ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు(Mumbai Crime Branch) సీజ్(Drugs Seized)చేశారు.

ముంబయిలో డ్రగ్స్‌ పరఫరా చేస్తోన్న బంగ్లాదేశ్ మహిళను అరెస్టు చేసిన కేసులో వాగ్దేవీ కెమికల్స్ అక్రమ డ్రగ్స్ వ్యాపారం గుట్టు రట్టుకాగా సంస్థ చైర్మన్ విజయ్ ఓలేటిని పోలీసులు అరెస్టు చేశారు. కుషాయిగూడ కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్ వేసి అతనితో పాటు నిందితుడు తానాజీని కూడా ముంబైకి తరలించారు. సోమవారం వారిని ముంబై కోర్టులో హాజరుపరుస్తారు. సంస్థ యాజమాని గతంలోనూ పోలీసులకు పట్టుబడినట్లు దర్యాప్తులో తేలింది. అప్పట్లో తన పలుకుబడితో డ్రగ్స్‌ కేసులో అరెస్టు కాకుండా చూసుకున్నాడు. ల్యాబొరేటరీలో డ్రగ్స్‌ తయారీ యూనిట్‌ విషయం బయటపడింది. ఈ కేసును చేధించేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల్లో ఒకరు నెల రోజుల క్రితం కార్మికుడిగా పనిలో చేరి పక్కాగా ఒక్కో వివరాలను సేకరించాకే దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో చర్లపల్లిలో పట్టుబడిన ఇద్దరితో సహా మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్లు సీపీ నికేత్‌ కౌషిక్‌ తెలిపారు. నిందితుల్లో ఒక బంగ్లాదేశీ యువతి సైతం ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 27 మొబైల్‌ ఫోన్లు, మూడు కార్లు, ఒక టూవీలర్‌ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ నెట్‌వర్క్‌కు, అంతర్జాతీ యంగా డ్రగ్‌ నెట్‌వర్క్‌లకు సైతం హైదరాబాద్‌ శివారులో తయారయ్యే ఎండీ డ్రగ్‌ సరఫరా అవుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.