Tamil Nadu | liquor Scam
విధాత: దేశంలో లిక్కర్ స్కామ్ లు అధికార పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఏకంగా సీఎంగా ఉన్నా కేజ్రీవాల్ సహా ఎంపీలు, మంత్రులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కేరళలోనూ పినరయి విజయన్ ప్రభుత్వంపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు వెలువడ్డాయి. ఏపీలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ అమ్మకాల అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలోనూ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. తమిళనాడులో సీఎం స్టాలిన్ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ ద్వారా 1000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లుగా ఈడీ గుర్తించిందన్న కథనాలు సంచలనం రేపుతున్నాయి. ఒక్కో బాటిల్ పై రూ.10నుంచి 30రూపాయలు అదనంగా వసూలు చేశారని..ఖర్చులు, అమ్మకాల లెక్కలు పెంచి మోసాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. లిక్కర్ స్కామ్ పై డీఎంకే సమాధానం చెప్పాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేశారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. త్వరలోనే ఈ కేసులో చాలమంది అరెస్టవుతారని అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు.
రూ.1000కోట్ల అవినీతి!
తమిళనాడులో గత 20 సంవత్సరాలుగా మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధీనంలోనే నడుస్తున్నాయి. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(TASMAC) ద్వారా మద్యం షాపుల నిర్వహణ జరుగుతుంది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్)లో రూ.1,000 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని టాస్మాక్.. రాష్ట్రవ్యాప్తంగా 4,830 దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు సాగిస్తోంది. వీటిల్లో ప్రతిరోజూ సరాసరిన రూ.150 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. టాస్మాక్ సంస్థ ఏడు కంపెనీల నుంచి బీర్లు, 11 కంపెనీల నుంచి మద్యం రకాలు కొనుగోలు చేస్తోంది. గత కొన్ని ఏళ్లుగా టాస్మాక్ ఆధ్వర్యంలో జరిగే మద్యం క్రయ విక్రయాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నాయకులకు చెందిన డిస్టలరీస్ నుంచి షాపులకు మద్యం సరఫరా చేసి, వాటిని ప్రభుత్వ లెక్కల్లో చూపకుండా ఆ ఆదాయాన్ని డిస్టలరీస్ యజమానులు ప్రజాప్రతినిధులు అలాగే కొందరు అధికారులు కలిసి పంచుకుంటున్నట్టు అభియోగాలు ఉన్నాయి.
డిస్టలరీస్ యజమానులుగా డీఎంకే కీలక నేతలు
మద్యం సరఫరా చేస్తున్న డిస్టలరీస్ యజమానులుగా డీఎంకే మాజీ మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుమానంతో ఇటీవల డీఎంకే కీలక నేత విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, చెన్నైలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయం, మద్యం విక్రయించే సంస్థలు, టాస్మాక్ మాజీ అధికారుల ఇళ్లలో ఈ నెల 6న ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మూడు రోజులు సాగిన ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, భారీగా నగదు లభ్యమైంది. ఇక్కడి నుంచి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరింత లోతుగా విచారణ కొనసాగిస్తుండగా ఒక్కోటిగా అక్రమాలు వెలుగుచూస్తుండటంతో అధికార డీఎంకే చుట్టు ఉచ్చు బిగిస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన ధరలతో పోల్చితే నేరుగా షాపులకు మద్యం పంపించినట్లు ఈడీ గుర్తించింది. లిక్కర్ అమ్మకాలు, అధికారిక లెక్కల్లో చూపని విక్రయాలకు సంబంధించి వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ప్రాథమికంగా ఈడీ గుర్తించింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి అధికారికంగా విక్రయించడం కంటే ఎక్కువగా ఉండడంతో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నట్టు ఈడీ అంచనాకు వచ్చింది. ఇటీవల మద్యం విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ములో సుమారు 1000 కోట్ల రూపాయలు లంచంగా డిస్టలరీస్ వ్యాపారులు ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇంత మొత్తం ఎవరికీ చేరింది? ఇందులో ఎవరు కీలకంగా వ్యవహరించారు? అన్న అంశంపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మద్యం అక్రమాలపై ఈడి మరింత లోతుగా విచారణ జరిపిన తర్వాత ఢిల్లీ తరహాలో ఇక్కడ కూడా అరెస్టులు తప్పవని రాజకీయంగా చర్చ సాగుతోంది.