ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సన్నిహితుడిగా చెప్పే అదానీ మోసాలకు మరిన్ని సాక్ష్యాలు వెలుగు చూస్తున్నయి. బొగ్గు ధరలను అమాంతం పెంచేయడం ద్వారా అదానీ కంపెనీ భారీ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సన్నిహితుడిగా చెప్పే అదానీ మోసాలకు మరిన్ని సాక్ష్యాలు వెలుగు చూస్తున్నయి. బొగ్గు ధరలను అమాంతం పెంచేయడం ద్వారా అదానీ కంపెనీ భారీ ప్రయోజనాలు పొందిందని, కోట్లాది మంది భారతీయులు మాత్రం అందుకు అధిక విద్యుత్తు చార్జీల రూపంలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తాజాగా వెల్లడైంది. అదానీ గ్రూపు ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక కీలక వ్యాపారాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. అదానీ స్వల్ప కాలంలోనే శతకోటీశ్వరుడిగా మారిన వైనంపై పార్లమెంటులో సైతం ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా.. దిగుమతి చేసుకున్న బొగ్గును మార్కెట్ ధరకంటే అమాంతం పెంచేయడం ద్వారా వందల కోట్ల డాలర్ల లాభాలను సంపాదించిందని కస్టమ్స్ రికార్డుల పరిశీలనలో వెల్లడైనట్టు తెలుస్తున్నది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బొగ్గు కంపెనీగా అదానీ సంస్థ ఉన్నది. బొగ్గు ధరలను విపరీతంగా పెంచేసిందని చాలా కాలంగా ఉన్న ఆరోపణలకు తాజా వివరాలు బలం చేకూర్చుతున్నాయి.
గత రెండేళ్లుగా అదానీ కంపెనీ తైవాన్, దుబాయి, సింగపూర్ నుంచి ఐదు బిలియన్ డాలర్ల విలువైన బొగ్గును దిగుమతి చేసుకుని, మార్కెట్ రేటుకు రెట్టింపునకు పైగా ధరకు అమ్మేసినట్టు ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదానీ కంపెనీ బొగ్గు దిగుమతి చేసుకున్న ఒక తైవానీ సంస్థ యజమాని.. అదానీ కంపెనీల్లో రహస్య భాగస్వామి అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 నుంచి 2021 మధ్య దాదాపు 32 నెలల కాలంలో ఇండోనేసియా నుంచి భారత్కు అదానీ కంపెనీ ద్వారా జరిగిన 30 దిగుమతులను పరిశీలిస్తే.. వీటన్నింటిలోనూ షిప్మెంట్ రవాణా జరుగుతున్న సమయంలో 70 మిలియన్ డాలర్లపైగా పెంచేశారని చెబుతున్నారు. ఎక్స్పోర్ట్ డిక్లరేషన్లలో ఉన్న ధరకంటే దిగుమతి చేసుకున్నాక చూపుతున్న ధర ఊహించలేనంత ఎక్కువ ఉన్నదని అంటున్నారు. అంటే బొగ్గు షిప్మెంట్ ప్రయాణ సమయంలోనే దాదాపు 70 మిలియన్ డాలర్లకుపైగానే రేటు పెంచేశారని వారు పేర్కొంటున్నారు.
ఇదీ మోసం తీరు!
పలువురు ఆర్థిక నిపుణులు ఈ వ్యవహారాన్నిసులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. వాస్తవానికి ఒక షిప్మెంట్ ఎక్స్పోర్ట్ రికార్డుల్లో నమోదైన ధర 1.9 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 15.82 కోట్లు. దానికి షిప్పింగ్, ఇన్సూరెన్స్ చార్జీల కింద 42వేల డాలర్లు (35 లక్షల రూపాయలు) అవుతుంది. కానీ.. గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకునే సమయానికి అదానీ కంపెనీ ఆ విలువను ఏకంగా 4.3 మిలియన్ డాలర్లుగా.. అంటే.. 35,80,85,132 రూపాయలుగా చూపిస్తుంది. అంటే.. అంటే దాదాపు 20 కోట్లు ధర పెంచేశారన్నమాట! ఈ లెక్కన 32 నెల్లలో జరిగిన షిప్మెంట్లను లెక్కిస్తే? కళ్లు తిరిగే దోపిడీ కళ్లముందు నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. సంపన్నుల జాబితాలో ఎక్కడో 609వ స్థానంలో ఉన్న అదానీ.. 2వ స్థానానికి ఎగబాకడంపై రాహుల్గాంధీ పార్లమెంటులో కూడా ప్రశ్నించారు. బొగ్గు దిగుమతిలో అక్రమాలను చూస్తే.. ఆయన ఎలా ఎదిగారో అర్థం చేసుకోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి ఏడేళ్ల క్రితమే ఇంధన చార్జీల పెంపు అంశం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నిర్వహించిన దర్యాప్తులోనే వెల్లడైంది. ఇండోనేసియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ధరలను కృత్రిమంగా పెంచేసి, పవర్ కంపెనీలకు విక్రయించారన్న ఆరోపణలపై డీఆర్ఐ 2016లోనే 40 మంది దిగుమతిదారుల పేర్లను ఒక నోటీసులో పేర్కొన్నది. అందులో ఐదు అదానీ కంపెనీలు, ఇదే గ్రూపు సరఫరా చేసిన మరో ఐదు కంపెనీలు కూడా ఉన్నాయని తెలుస్తున్నది.
ఎగుమతి, దిగుమతి రికార్డులను పరిశీలిస్తే.. 50 శాతం నుంచి వంద శాతం వరకూ విలువ పెంచేసినట్టు తేలుతున్నదని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. షిప్మెంట్ ప్రయాణ సమయంలోనే మూడో పార్టీని తీసుకొచ్చి, అక్కడి ఏజెంట్ల ద్వారా సప్లయిర్స్ ఇన్వాయిస్లు సృష్టించడం జరిగిందని తెలిపింది. దీన్నే ట్రేడ్ బేస్డ్ మనీలాండరింగ్ అని కూడా పిలుస్తారు. ఇదిలా ఉంటే.. అదానీ కంపెనీ ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గుకు అక్కడి ధర ప్రకారం కాకుండా.. అధిక మొత్తంలో విక్రయించడం ద్వారా రాష్ట్ర ప్రజలు 2018 నుంచి అధిక విద్యుత్తు చార్జీలు చెల్లించాల్సి వస్తున్నదని గుజరాత్లోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే.. ఈ కథనాలను, విమర్శలను అదానీ గ్రూపు కొట్టపారేస్తున్నది. ఇవన్నీ పాత, ఆధారరహిత ఆరోపణలేనని తేల్చేస్తున్నది. ప్రజలకు అందుబాటులో ఉన్న వాస్తవాలు, సమాచారాన్ని వక్రీకరించడమేనని పేర్కొంటున్నది.