ఆర్ధిక శ్వేత పత్రంలోని అప్పుల లెక్కల్లో తప్పుడు వివరాలు పొందుపరుచారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రశ్నించారు
విధాత : ఆర్ధిక శ్వేత పత్రంలోని అప్పుల లెక్కల్లో తప్పుడు వివరాలు పొందుపరుచారని, అసలు ఆర్బీఐ, కాగ్, రాష్ట్ర బడ్జెట్లోని లెక్కల్లో దేనిలోని లెక్కలతో ఆ శ్వేత పత్రం రూపొందించారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ఆర్ధిక శ్వేత పత్రంపై చర్చలో ఆయన మాట్లాడుతూ అప్పుల వివరాలను ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేస్తున్నారని, రాష్ట్రంలో అప్పులు పెరిగిన విషయం వాస్తవమేనని, అదే సమయంలో 60ఏళ్లలో జరుగని అభివృద్ధి కూడా జరిగిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని శ్వేత పత్రం విడుదలతో రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని, తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
నిజానికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు లాభాదాయక ఆదాయ వనరులు దండిగా ఉన్న రాష్ట్రమేనన్నారు. శ్వేత పత్రం విడుదల వెనక ప్రభుత్వం అసలు ఉద్దేశం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం 44 లక్షల కోట్ల అప్పు చేస్తే ఎందుకు ప్రశ్నించరన్నారు. నేను ఎవరి పక్షం మాట్లాడటం లేదని, తెలంగాణ రాష్ట్రం పక్షాన మాట్లాడుతున్నానన్నారు. గత పాలకులు తప్పులు చేస్తే దర్యాప్తు చేయండని, సహకరిస్తామన్నారు. అలాగే డ్రగ్ నిర్మూలనకు కూడా సహకరిస్తామన్నారు. హైద్రాబాద్ నగర అభివృద్ధికి, మూసీ ప్రాంత సుందరీకరణకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా మంత్రి శ్రీధర్బాబు మధ్యలో కల్పించుకుని తాము ఆర్ధిక శ్వేత పత్రం ప్రధాన ఉద్దేశం పదేళ్లలో సాధించిన ప్రగతితో పాటు తెచ్చిన అప్పులు ఎక్కడ ఖర్చు చేశారన్నదానిపై ప్రజలకు తెలియచేయడమేనన్నారు. అలాగే భవిష్యత్తులో అనుసరించాల్సిన ఆర్ధిక క్రమశిక్షణకు దిక్సూచీగా మాత్రమే శ్వేతపత్రం వివరాలను వెల్లడించామన్నారు. శ్వేత పత్రంలో పొందుపరిచిన లెక్కలను ఆర్బీఐ, కాగ్ ల నుంచి అవసరమైన మేరకు తీసుకున్నామని స్పష్టం చేశారు.