Site icon vidhaatha

AP | ఈనెల 20న ఏపీ కేబినెట్‌ భేటీ

AP

విధాత: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ఈనెల 20 సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో మధ్యాహ్నం 3గంటలకు జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక అంశాలను చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

ముఖ్యంగా ఈ నెల 21నుంచి ఐదు రోజుల పాటు ఏపీ శాసన సమావేశాల నిర్వహించనున్న నేపధ్యంలో సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై కేబినెట్‌లో చర్చ సాగనుంది. ఏపీ శాసన సభ సమావేశాలు ఈ నెల 21నుండి 5రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అవసరం మేరకు సమావేశాలను మరో ఒకటి రెండు రోజులు పొడగించవచ్చని కూడా సమాచారం.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు, సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జీపీఎస్‌ బిల్లును, మరికొన్ని ఆర్డీనెన్స్‌ల బిల్లులను ప్రభుత్వం సమావేశంలో ప్రవేశపెట్టనుంది. అలాగే సీఎం ఆఫీస్‌ విశాఖకు తరలివెళ్లే అంశం అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానుంది.

మరోవైపు ఇదే సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపైన కేసులు, అరెస్టుల వ్యవహారాన్ని ప్రస్తావించాలని వైఎస్సార్‌సీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కౌంటర్‌గా టీడీపీ కూడా బాబు అరెస్టు పరిణామాలపై ప్రభుత్వంపై దాడికి వ్యూహరఛన చేయనుండటంతో ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు మరింత వాడివేడిగా సాగనున్నాయి. అయితే చంద్రబాబుకు అసెంబ్లీ సమావేశాల నాటికి బెయిల్‌ లభిస్తుందా ఆయన ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నిదానిపై ఉతంఠ నెలకొంది.

Exit mobile version