Army Soldiers Martyred |

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ అండ్‌ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారులు తెలిపారు. తనిఖీలు చేపడుతున్న సమయంలో నక్కిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత బలగాలు సైతం ప్రతిగా కాల్పులు జరిపారు.

అయితే, ఎదురుకాల్పుల్లో ముగ్గురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఆపరేషన్‌ హలాన్‌లో భాగంగా కుల్గామ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం అందిందని, ఈ మేరకు శుక్రవారం తనిఖీలు చేపట్టినట్లు చినార్‌ కార్ప్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

తనిఖీలు చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు గాయపడ్డారని, ఆ తర్వాత చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు పేర్కొంది. ప్రస్తుతం సంఘటనా స్థలానికి అదనంగా బలగాలను తరలించి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు చినార్‌ కార్ప్స్‌ వివరించింది.