విధాత : హిందువుల పార్టీగా చెప్పుకొనే బీజేపీ పట్ల.. హిందువుల్లో సైతం నమ్మకాలు సడలిపోతున్నాయి. ఇప్పటికే కర్ణాటక ఓటరు ఇదే విషయాన్ని ప్రకటించగా.. తాజాగా మధ్యప్రదేశ్ సైతం అదే సంకేతాలు పంపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్లో కీలక సంస్థగా చెప్పే బజరంగ్ సేన (Bajrang Sena) సభ్యులు కాంగ్రెస్లో చేరారు.
బీజేపీ.. కేవలం ఓట్లు దండుకునేందుకే మతాన్ని వాడుకుంటున్నదని, నిజానికి హిందువుల సాదక బాధకాలను పరిష్కరించడం లేదని బజరంగ్ సేన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బజరంగ్ సేన సభ్యులు కాంగ్రెస్లో చేరడం మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో బీజేపీకి పెద్ద షాక్ వంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బంజరంగ్ సేనకు చెందిన ఒక గ్రూపు.. పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరింది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్లో చేరిన సీనియర్ నాయకుడు దీపక్ జోషితో కలిసి వీరంతా వచ్చారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో హనుమాన్ చాలీసాను పఠించారు.
ఈ సందర్భంగా కమల్నాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన బజరంగ్ సేన సభ్యలు.. సత్యాన్ని సమర్థించారని అన్నారు. బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్ అప్పుల ఊబిలోకి జారిపోతున్నదన్న విషయాన్ని కూడా వీరు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్పైనా విమర్శలు గుప్పించిన కమల్నాథ్.. చౌహాన్ తన 15 ఏళ్ల పదవీ కాలంలో 22వేల హామీలు ఇచ్చారని, 15వేల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పాపాన్ని ఆయన మోస్తున్నారని అన్నారు.