Bellampally | ఎమ్మెల్యేకు ‘ఆరిజన్ డెయిరీ’ ఉచ్చు ఈ వ్యవహారంపై అధిష్టానం గుర్రు విపక్షాల కుట్ర అంటున్న చిన్నయ్య వర్గీయులు విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్నయ్య సిటింగ్ స్థానానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయా? అంటే… అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరిజన్ డెయిరీ వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటుందనే చర్చ వినిపిస్తోంది. లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తూ ఆ సంస్థ మహిళా సీఈఓ రచ్చకెక్కిన విషయం తెలిసిందే. […]
Bellampally |
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్నయ్య సిటింగ్ స్థానానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయా? అంటే… అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరిజన్ డెయిరీ వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటుందనే చర్చ వినిపిస్తోంది.
లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తూ ఆ సంస్థ మహిళా సీఈఓ రచ్చకెక్కిన విషయం తెలిసిందే. తనకు తెలంగాణ లో న్యాయం జరగడం లేదంటూ ఏకంగా ఢిల్లీ దాకా చేస్తున్న పోరాటం… అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కు రాబోయే ఎన్నికల్లో సిటింగ్ స్థానానికి ఎసరుపడుతుందన్న వాదన తెరపైకి వచ్చింది.
రోజురోజుకూ ముదురుతున్నఈ వివాదం ఎన్నికల వేళ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది.
డెయిరీ వివాదానికి కారణాలివే?
బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆరిజన్ డెయిరీ సంస్థ పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్థల సేకరణ, భాగస్వాముల ఎంపిక విషయంలో బెల్లంపల్లి శాసనసభ్యుడు దుర్గం చిన్నయ్య కీలకపాత్ర పోషించారని ప్రచారంలో ఉంది. అయితే ఆ సంస్థ సీఈఓ శేజల్ పలు ఆరోపణలకు దిగింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను నమ్మించి మోసం చేశాడని, మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళనకు దిగింది.
కొంత కాలంగా కొనసాగుతున్న ఈ వివాదం గల్లీ నుండి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ దాగా పాకి, మళ్లీ బెల్లంపల్లికి చేరింది. తొలుత హైదరాబాద్ లో న్యాయం చేయాలని డీజీపీని ఆశ్రయించిన శేజల్… ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ లకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే అధికార పార్టీ ఒత్తిడితో తనకు ఇక్కడ న్యాయం జరగడం లేదని ఢిల్లీకి కూడా వెళ్ళి ఆందోళన చేపట్టింది.
తెలంగాణ భవన్ నూ వదలకా, ఆందోళనకు వేదిక చేసుకుంది. జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఓ దశలో ఆత్మహత్యా యత్నం కూడా చేసింది. తాజాగా బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అయితే శేజల్ ధర్నా చేపట్టిన విషయం తెలుసుకున్న పోలీసులు, క్యాంప్ కార్యాలయానికి చేరుకొని ఆందోళనను భగ్నం చేశారు.
ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు తెచ్చేనా?
ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం శేజల్ వివాదాన్ని కొట్టి పడేస్తున్నారు. ఇది విపక్షాల కుట్ర అని ఆరోపిస్తున్నారు. మరో వైపు అధిష్టానం ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిన్నయ్య వరుసగా రెండు సార్లు బెల్లంపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికల వేళ ఈ వ్యవహారం ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అవినీతి, వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అధికార పార్టీ అభ్యర్థుల జాబితాల్లో దుర్గం చిన్నయ్య పేరు కనిపించకపోవడం ఎమ్మెల్యే వర్గీయులను కలవరపెడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీకి ఏడు స్థానాల్లో సిటింగులకే మళ్లీ అవకాశం కల్పించారని, మూడు స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారని… ఇలా రకారకాలుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న జాబితాల్లో బెల్లంపల్లి నుండి పేరు కనబడకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే శేజల్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని అధిష్టానం కావాలనే చిన్నయ్యను తప్పించిందా? లేక ఇది కేవలం ప్రచారమేనా? తెలియాలంటే అధికార పార్టీ అధికారికంగా త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేంత వరకు వేచి చూడాల్సిందే.