BJP | కిషన్‌రెడ్డి, రఘునందన్‌ అరెస్ట్.. ORR వద్ద ఉద్రిక్తత

BJP ఈటెల, డీకే అరుణల హౌజ్‌ అరెస్టు ఛలో బాటసింగారంకు పోలీస్ నో పర్మిషన్ బీజేపీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల సందర్శన భగ్నం విధాత: బీఆరెస్ ప్రభుత్వ విధానాలపై బీజేపీ రాష్ట్ర కమిటీ చేపట్టిన పోరుబాటలో భాగంగా గురువారం తలపెట్టిన చలో బాట సింగారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్శన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. చలో బాట సింగారం కార్యక్రమానికి అనుమతి లేదంటు పోలీసులు బీజేపీ నేతలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల […]

  • By: Somu    latest    Jul 20, 2023 12:30 AM IST
BJP | కిషన్‌రెడ్డి, రఘునందన్‌ అరెస్ట్.. ORR వద్ద ఉద్రిక్తత

BJP

  • ఈటెల, డీకే అరుణల హౌజ్‌ అరెస్టు
  • ఛలో బాటసింగారంకు పోలీస్ నో పర్మిషన్
  • బీజేపీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల సందర్శన భగ్నం

విధాత: బీఆరెస్ ప్రభుత్వ విధానాలపై బీజేపీ రాష్ట్ర కమిటీ చేపట్టిన పోరుబాటలో భాగంగా గురువారం తలపెట్టిన చలో బాట సింగారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్శన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. చలో బాట సింగారం కార్యక్రమానికి అనుమతి లేదంటు పోలీసులు బీజేపీ నేతలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్శనకు వెళ్లకుండా ఎక్కడి వారిని అక్కడే ముందస్తు అరెస్టులు చేశారు. జంట నగారాలతో పాటు జిల్లాల్లోనూ కూడా బీజేపీ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేసి బాట సింగారంకు వెళ్లకుండా కట్టడి చేశారు.

ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్‌ను, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణలను హౌజ్ అరెస్టులు చేశారు. దీంతో వారు ఇళ్ల నుండి బయటకు వెళ్లలేకపోయారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్శనకు హాజరయ్యేందుకు ఢిల్లీ నుండి గురువారం ఉదయం రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని పోలీసులు శంషాబాద్ విమానాశ్రయం వద్దనే బలవంతంగా అరెస్టు చేశారు.

కిషన్‌రెడ్డి వెంట ఉన్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇతర నాయకుల, కార్యకర్తల వాహన శ్రేణిని పోలీసులు అడ్డుకోవడంతో కిషన్‌రెడ్డి సహా వారంతా వర్షంలోనే రోడ్డుపైన బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులు వారందరిని అరెస్టు చేసి అక్కడి నుండి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టు సందర్భంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతు కల్వకుంట్ల ఎమర్జన్సీలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో లేమా, ప్రతిపక్షంగా పేదల కోసం పోరాడే హక్కు లేదా..అంటు నిలదీశారు. నేను కేంద్ర మంత్రినని, నా వాహనాన్ని ఎలా అడ్డుకుంటారని, నేనేమైనా టెర్రరిస్టునా క్రిమినల్‌నా అంటు రాచకొండ సీపీ చౌహన్‌పై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం యుద్దం మొదలు పెట్టిందని, బీజేపీ ముగింపు ఇస్తుందన్నారు. ఆట మొదలైందని, ఆట ఎలా ఆడాలో బీజేపీకి తెలుసన్నారు.

సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలో 50లక్షల ఇళ్లు కట్టే దమ్ముందా అని, కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత నాదన్నారు. ప్రభుత్వ క్వార్టర్స్ కూల్చి పదేకరాల్లో ప్రగతిభవన్ ఇల్లు కట్టుకున్న కేసీఆర్‌కు పేదల ఇళ్లు కట్టించేందుకు చేతలు రావడం లేదన్నారు. కేసీఆర్ కు అభద్రత భావం పట్టుకుందని, మొండిగోడల ఇళ్లను చూస్తే ఆయనకు వచ్చిన బాధ ఏమిటోనన్నారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని, బీజేపీ తన పోరాటాలను ఉదృతం చేస్తుందన్నారు.

అటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు బాట సింగారంకు వెళ్లేందుకు ప్రయత్నించగా సమీపంలో స్థానిక పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్లకు తరలించారు. శామీర్‌పేటలో ఈటెల రాజేందర్‌ను గృహనిర్భందం చేయగా, పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ను హబ్సిగూడలో, తార్నాకలో డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావును గృహనిర్భంధం చేశారు.

అలాగే పార్టీ జంటనగరాల నాయకులను, రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ఉన్న వారిని ఎక్కడికక్కడే నిర్భంధం చేశారు. బీజేపీ నేతల ముందస్తు అరెస్టులను ఈటెల, డీకే, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ సహా అంతా తీవ్రంగా ఖండించారు. కేంద్రం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు నిధులిస్తే వాటిని సద్వినియోగం చేయకుండా, కట్టిన ఇళ్లను పేదలకు పంచకుండా కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు.

బీజేపీ ఆందోళనపై మంత్రుల ఫైర్‌

బీజేపీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్శన, అరెస్టులపై ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై చేసిన విమర్శ ల పట్ల మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌, కేటీఆర్‌లు కౌంటర్ ఎటాక్ చేశారు. తలసాని మాట్లాడుతు కిషన్‌రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్శన పేరుతో రాజకీయం చేయడం సరికాదన్నారు. నీవు నిజంగా చూడాలనకుంటే నేనే వచ్చి చూపిస్తానన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు కేంద్రం నుండి 600కోట్లు రావాల్సివుందని వాటిని విడుదల చేయించాలని తలసాని కౌంటర్ వేశారు.

మేం కట్టిన ఇళ్ల కోసం మీకేందుకు తాపత్రాయమని, వాటిని పేదలకు ఎప్పుడు పంచాలో మాకు తెలుసన్నారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తు హైద్రాబాద్ పరిధిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆగస్టు మొదటి వారంలో పంపిణి చేస్తామన్నారు. జిహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో గతంలో కొన్నింటిని పంపిణీ చేశామని, మరో ఆరు దశల్లో నిర్మాణం పూర్తయిన 65వేల ఇళ్లను ఆగస్టు మొదటివారంలో పంపిణీ చేస్తామన్నారు.