విధాత: భారతదేశ చరిత్రను చరిత్ర పాఠ్యాంశాల నుంచి తీసివేయడం అంటే దేశ ప్రజలను ముఖ్యంగా చదువుకుంటున్న యువతను వాస్తవాలనుంచి తప్పు దోవ పట్టించడానికి జరుగుతున్న ప్రయత్నం. ఎన్సీఈఆర్టీ (NCERT) 11,12 వ తరగతులలో చరిత్ర పాఠ్యాంశాల నుంచి అనేక ముఖ్యమైన చారిత్రక ఘట్టాలను, వాస్తవాలను తొలగించడం జరిగింది. సిలబస్ లో కొన్ని పాఠ్యాంశాలు తొలగించి కొవిడ్ అనంతర పరిణామాల వల్ల విద్యార్థుల్లో ఏర్పడ్డ మానసిక ఒత్తిడిని తొలగించామని ప్రకటించినారు. కానీ నిజానికి కొందరు రాజులను, కొంతమంది సామాజికవేత్తలు,శాంతి […]
విధాత: భారతదేశ చరిత్రను చరిత్ర పాఠ్యాంశాల నుంచి తీసివేయడం అంటే దేశ ప్రజలను ముఖ్యంగా చదువుకుంటున్న యువతను వాస్తవాలనుంచి తప్పు దోవ పట్టించడానికి జరుగుతున్న ప్రయత్నం. ఎన్సీఈఆర్టీ (NCERT) 11,12 వ తరగతులలో చరిత్ర పాఠ్యాంశాల నుంచి అనేక ముఖ్యమైన చారిత్రక ఘట్టాలను, వాస్తవాలను తొలగించడం జరిగింది. సిలబస్ లో కొన్ని పాఠ్యాంశాలు తొలగించి కొవిడ్ అనంతర పరిణామాల వల్ల విద్యార్థుల్లో ఏర్పడ్డ మానసిక ఒత్తిడిని తొలగించామని ప్రకటించినారు.
కానీ నిజానికి కొందరు రాజులను, కొంతమంది సామాజికవేత్తలు,శాంతి కాముకులైన వారి చరిత్రలను, వారు భారత సమాజానికి చేసిన కృషిని పనిగట్టుకుని తొలగించారు. ఇందులో ప్రపంచానికి అహింసా మార్గాన్ని చూపిన, భారతదేశ స్వాతంత్య్రంలో ప్రధాన భూమిక నిర్వహించిన మహాత్మా గాంధీ కూడా ఉన్నారు.
ముఖ్యంగా మధ్యయుగంలో భారతదేశాన్ని సుమారు 800 సంవత్సరాలు పరిపాలించిన వివిధ రాజుల చరిత్రను తొలగించేశారు. వీరందరూ ముస్లిం రాజులే. భారతదేశ చరిత్రలో ఈ పరిపాలనా కాలంలో జరిగిన మార్పులు, మానవ పరిణామ క్రమంలో ఈ కాలపు పాత్రను తొలగించడం ద్వారా మన దేశ చరిత్రను మనమే మరిచిపోయేలా చేయడం అనే కుట్ర కోణం ఉంది.
రాజనీతి శాస్త్రంలోనూ కోతలు
చరిత్రలోనే కాదు రాజనీతి శాస్త్రంలో కూడా అనేక పాఠ్యాంశాలను తొలగించారు. తీసివేసిన పాఠ్యాంశాలను మనం పరిశీలిస్తే తొలగించడం వెనక ఉన్న ఉద్దేశాలు అర్థమవుతాయి. భారత ప్రజాస్వామ్యము-వైవిధ్యం, భారతదేశంలో ప్రజా పోరాటాలు-ఉద్యమాలు, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు, స్వాతంత్రానంతరం భారత దేశంలో రాజకీయాలు. ఈ చాప్టర్లను తొలగించడం ద్వారా మనదేశంలో ప్రజాస్వామ్యం ఇంతకాలం వర్ధిల్లడానికి కారణమైన భిన్నత్వంలో ఏకత్వం యొక్క గొప్పతనాన్ని కనుమరుగు చేశారు.
ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లను పాఠ్యాంశంలో నుంచి తొలగించడం ద్వారా మన దేశ ప్రజాస్వామ్యాన్ని విద్యార్థులు భవిష్యత్తులో ఎలా కాపాడుకోవాలో అవగాహన లేకుండా చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. 75 ఏళ్ల పాటు ఈ రాజ్యాంగం మన దేశంలో మనగలగడానికి కారణమైన రాజనీతిని తెలియకుండా చేయడం ద్వారా భవిష్యత్తులో ఈ దేశ పౌరులు గుడ్డిగా మూఢచారాలతో జీవించాలని, తద్వారా భారత రాజ్యాంగం యొక్క విశిష్టత వారికి తెలియకుండా పరిపాలన సాగించాలని, ఈ పాలకవర్గం భావిస్తున్నది.
RSS పాపాలు గాయబ్
గాంధీని నాథూరామ్ గాడ్సే హత్య చేసిన సంఘటన చుట్టూ ఉన్న వాస్తవాలను, ఆయనకు ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు, ఆ హత్య కారణంగా ఆర్ఎస్ఎస్ పై విధించిన నిషేధాన్ని కనుమరుగు చేసే ప్రయత్నంలో భాగంగా ఆయా అంశాలన్నింటినీ పాఠ్యాంశాల నుండి తొలగించారు. హిందూ మతాన్ని జీవితకాలం అవలంబించిన మహాత్మా గాంధీని హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతున్నది.
దేశ విభజన అంశాలూ తొలగింపు
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువమంది ప్రజలు ప్రభావితమైన సమస్య భారత్, పాకిస్తాన్ విభజన. అప్పుడు అల్లకల్లోలమైన దేశ సామాజిక పరిస్థితులు వివరించే పాఠ్యాంశాలన్నింటిని తొలగించారు. దేశ విభజన సమయంలో తలెత్తిన ఘర్షణలు జరిగిన మారణకాండ విషయంలో నేటి విద్యార్థులకు సరైన అవగాహన లేకపోతే, భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఏ విధంగా జాగ్రత్తపడాలో కూడా అవగాహన లేకుండా పోతుంది. దేశ విభజన సమయంలో ఘర్షణలు, అపనమ్మకాలను తొలగించడానికి మహాత్మా గాంధీ చేసిన ప్రయత్నం చాలా గొప్పది. అటువంటి చారిత్రక ఘటనలు తొలగించడం ద్వారా శాంతి, సామరస్య భావాల యొక్క వినియోగం గురించి,సమరస సమాజ జీవనం గురించి అవగాహన చేసుకొనే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతారు.
అనేక ప్రజాందోళనలకూ చోటు ఇవ్వలే
ఇవే కాకుండా సమాజంలో గొప్ప పరిణామం తీసుకొచ్చిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన,నక్సలైట్ ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటాలు, ఆదివాసుల హక్కుల కోసం జరిగిన పోరాటాలు తొలగించారు.
వైవిద్య భరితమైన భారత దేశ ప్రజల జీవన విధానాన్ని, వివిధ కులాల,వర్గాల, తెగల యొక్క జీవన విధానాలు,సమాజం నుంచి ఏ విధంగా దూరం చేయబడ్డారు, ఆధునిక భారతదేశంలో వారి వెనుకబడ్డానికి గల కారణాలను నేటి విద్యార్థులకు యువతకు వివరించకపోతే భవిష్యత్తులో ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కునే ఆలోచన కూడా వీరికి రాదు.
భారతదేశంలో ఇందిరాగాంధీ హయాంలో ప్రకటించిన ఎమర్జెన్సీ పిరియడ్ కు సంబంధించిన పాఠ్యాంశాన్ని తొలగించారు. ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకులను ఇతర పార్టీల నాయకులను అక్రమంగా జైల్లో బంధించడం, పౌర హక్కులను కాలరాయడం రెండు సంవత్సరాల పాటు పత్రికా స్వాతంత్రం కూడా లేకుండా చేసిన చారిత్రక అంశాలన్నింటినీ తొలగించారు.
గుజరాత్ అల్లర్లపైనా ముసుగు
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు వాటి ఫలితంగా వెయ్యి మంది చనిపోవడం, అందులో ఎక్కువ మంది ముస్లింలు ఉండడం, ఈ విషయాన్ని పాఠ్యాంశాల నుంచి తొలగించబడ్డాయి. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు దేశంలో పునరావృతం కావద్దంటే, ఆ ఘటనల పర్యావసానాలు,ప్రజలు పడ్డ వేదనను దుఃఖాన్ని విద్యార్థులకు వివరించవలసి ఉంటుంది.
అవన్నీ తొలగించడం వల్ల అధికార పార్టీ తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుండవచ్చు. కానీ భారతదేశం లాంటి వైవిద్య భరిత సమాజంలో జీవించాలంటే విద్యార్థుల్లో సౌభ్రాతృత్వ భావనలు కలిగించాలి.
ఇదే విధానం కొనసాగితే వాస్తవాల మీద నిర్మించిన చరిత్రను తొలగించి, నిరాధార ఊహాజనిత విషయాలనే చరిత్రగా మన ముందు నిలబెట్టే పని, ప్రయత్నం విస్తృతంగా సాగుతుంది. మన చరిత్రను కనుమరుగు చేసి మను చరిత్రను ప్రతిక్షేపించడమే పరమావధిగా కనిపిస్తుంది. – ఎర్రోజు శ్రీనివాస్.