విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్ కి వెళ్ళాలి తప్ప.. మంత్రాలు, తంత్రాలు చేశారని మూఢనమ్మకాలతో తాంత్రికుని దగ్గరికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జరిగింది. బొక్కలగూడెం కాలనీకి చెందిన యువకుడు దాసరి మధు (30) అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే… మధు వారం రోజులుగా అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో కుటుంబ సభ్యులు తాంత్రికుని దగ్గరికి తీసుకెళ్లి చూపించారు. ఎవరో మంత్రాలు చేశారని, అందుకే అతనికి నయం కావడం లేదని తాంత్రికుడు మాయమాటలు చెప్పాడు. గోదావరి నది వద్దకు తీసుకెళ్లి క్షుద్ర పూజలు చేస్తే నయం అవుతాదని చెప్పాడు. కుటుంబ సభ్యులు మంత్రగాని మాటలు నమ్మారు. ఆదివారం గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ తాంత్రిక పూజలు నిర్వహిస్తుండగా యువకుడు మృతి చెందినట్లు సమాచారం.
ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన కుటుంబీకులు గోదావరి సమీపంలో అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అడ్డుకున్నారు. అక్కడే వైద్యులచే పోస్టుమార్టం చేయించినట్లు సమాచారం. ఆస్పత్రికి వెళ్లకుండా తంత్ర పూజలు నిర్వహించడం మూలంగానే మృతి చెందినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.