బిచ్చమెత్తుకున్న డబ్బుతో భూముల కొని.. బిల్డింగులు కట్టాడు!
యాచించిన సొమ్ముతో ఓ బిచ్చగాడు శ్రీమంతుడిగా మారాడు. అంతేకాదు విలువైన భూములను కొనుగోలు చేశారు

పాట్నా : యాచించిన సొమ్ముతో ఓ బిచ్చగాడు శ్రీమంతుడిగా మారాడు. అంతేకాదు విలువైన భూములను కొనుగోలు చేశారు. తన ఇద్దరు పిల్లలను ఓ ప్రయివేటు పాఠశాలలో చదివిస్తున్నాడు. మరి ఆ బిచ్చగాడి గురించి తెలుసుకోవాలంటే బీహార్ రాజధాని పాట్నాకు వెళ్లాల్సిందే.
బిచ్చగాడు పప్పు మాటల్లోనే.. చిన్నతనంలో నన్ను స్కూల్కు పంపితే సరిగా వెళ్లకపోయేవాడిని. దాంతో మా కుటుంబ సభ్యులు నన్ను కొట్టేవారు. కోపంతో ముంబై వెళ్లిపోయాను. అక్కడ చాలా రోజులు ఉన్నాను. రైలులో వెళ్తుండగా ఒకసారి నా చేతికి గాయమైంది. హాస్పిటల్లో చేరాను. సంపాదించిన సొమ్మంతా అక్కడ ఖర్చు అయిపోయింది. రైల్వే స్టేషన్లో నన్ను చూసిన వారంతా బిచ్చగాడు అనుకుని డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు.
కేవలం రెండు గంటల్లోనే రూ. 3,400 వచ్చాయి. మరుసటి రోజు అదే ప్లేస్కు వెళ్లి కూర్చున్నాను. అలా ప్రయాణికులు డబ్బులు ఇస్తూనే ఉన్నారు. ఆ విధంగా యాచించడం అలవాటుగా మారింది. కొన్నాళ్లకు ముంబై నుంచి పాట్నాకు వచ్చాను. పాట్నాలోని హనుమాన్ టెంపుల్తో పాటు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో యాచించడం మొదలుపెట్టాను అని పప్పు పేర్కొన్నారు.
పప్పుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐతో పాటు బ్యాంకు ఆఫ్ బరోడాలో ఖాతాలు ఉన్నాయి. అతని భార్యకు ఐసీసీఐ, కో ఆపరేటివ్ బ్యాంకుల్లో ఉన్నాయి. యాచించిన సొమ్ముతో పలు ప్రాంతాల్లో భూములు కొన్నాను. ఒక ఇల్లు కూడా కట్టుకున్నారు. తన ఇద్దరు పిల్లలను పాట్నాలోని ఓ ప్రయివేటు పాఠశాలలో చదివిస్తున్నట్లు తెలిపారు. వారిని ఉన్నతమైన స్థానంలో చూడాలన్నదే తన లక్ష్యమని పప్పు స్పష్టం చేశారు. ప్రతి రోజు రూ. 400 సంపాదిస్తున్నానని, ఆ డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నానని చెప్పారు.
పప్పు మా నాయకుడు
ఈ సందర్భంగా పప్పు స్నేహితుడు విశాల్(బిచ్చగాడు) మాట్లాడుతూ.. పప్పు బిలినీయర్గా మారుతారని చెప్పాడు. తాము కూడా డబ్బు సంపాదించాం కానీ వృథా ఖర్చులు చేశామన్నాడు. ప్రతి బిచ్చగాడు పప్పుకు గౌరవం ఇస్తారని, ఆయనను అందరూ కోటీశ్వరుడు పప్పు అని పిలుస్తారని తెలిపాడు. పప్పు మా నాయకుడు అని విశాల్ పేర్కొన్నాడు.