Chada Venkat Reddy | జాతీయ విపత్తుగా కేంద్రం 5వేల కోట్లు ఇవ్వాలి: చాడ

Chada Venkat Reddy రాష్ట్ర ప్రభుత్వ సాయం కంటితుడుపు చర్య యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ హనుమకొండలోని వరద ముంపు ప్రాంతాలలో సందర్శన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ […]

  • Publish Date - August 1, 2023 / 12:57 AM IST

Chada Venkat Reddy

  • రాష్ట్ర ప్రభుత్వ సాయం కంటితుడుపు చర్య
  • యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి
  • సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్
  • హనుమకొండలోని వరద ముంపు ప్రాంతాలలో సందర్శన

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండలోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాలలో చాడ వెంకట్ రెడ్డి సిపిఐ జిల్లా నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు తీరని నష్టం జరిగిందని, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి వెళ్లడంతో సరిపోదని, కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందించాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానిది కంటితుడుపు చర్య

రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం రూ. 500 కేటాయించడం కంటి తుడుపు చర్యగానే మిగులుతుందని, వరద ముంపు ప్రాంతాలలో శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. వరంగల్, హనుమకొండ పట్టణాలలో నాలాలు కబ్జాకు గురయ్యాయని, చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారని, వాటి వల్లనే కాలనీలు ముంపుకు గురయ్యాయని అన్నారు.

ప్రజాప్రతినిధుల, నాయకుల అండతోనే నాలాలపై పెద్ద పెద్ద భవనాల నిర్మాణం జరిగిందని, దాని వల్లనే రోడ్లపైకి, ఇండ్లలోకి వరద నీరు చేరుకుందని అన్నారు. పాలకుల అలసత్వం వల్లనే వరంగల్, హనుమకొండలో ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ఆక్రమణకు గురైన నాలాలపై సర్వే చేయాలని డిమాండ్ చేశారు.

నాలాలపై నిర్మాణాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయం చూపాలని,నాలాలు వెడల్పు చేయాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సూచించారు. ఇటీవల వరదల వల్ల కొట్టుకొని పోయిన, కూలిపోయిన ఇండ్ల వారికి నష్ట పరిహారం ఇవ్వాలని, వరదల వల్ల మృతి చెందిన వారికి ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ కు ఏటా 300 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిన సిఎం మాట నీటిమూటగా మారిందని, స్మార్ట్ సిటీ కింద ప్రకటించిన కేంద్రం ఏమిచ్చిందో బిజెపి నాయకులు చెప్పాలని ప్రశ్నించారు.

పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరానికి 20వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ప్రకృతి వైపరీత్యాల కింద జిల్లాలో పంట నష్ట పోయిన వారికి నేటికీ నష్ట పరిహారం ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాగే పశువులు చనిపోయి నష్ట పోయారని, యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని అన్నారు.

ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు ఆదరి శ్రీనివాస్, మారుపాక అనిల్ కుమార్, కొట్టెపాక రవి, బాషబోయిన సంతోష్, మాలోతు శంకర్, మునిగాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Latest News