రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, టీపీసీసీ అధ్యక్షునిగా ద్విపాత్రాభినయం చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ప్రచారభారాన్ని భుజానికెత్తుకున్నారు
భారీ బహిరంగ సభల నిర్వహణ
రేపటి నుంచి ప్రచారం ప్రారంభం
19న మహబూబ్ నగర్, మహబూబాబాద్ లో
నామినేషన్ల కార్యక్రమానికి హాజరు
24 వరంగల్లో బహిరంగ సభ
రోజుకు ఒకటి, రెండు ప్రాంతాల్లో సభలు
ఇప్పటికి వారం రోజుల షెడ్యూల్ ఖరారు
విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, టీపీసీసీ అధ్యక్షునిగా ద్విపాత్రాభినయం చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ప్రచారభారాన్ని భుజానికెత్తుకున్నారు. రేపటి (శుక్రవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని కొనసాగించేందుకు నిర్ణయించారు. రోజుకు ఒకటి, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించే విధంగా ఏడు రోజుల పాటు రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారు చేశారు.
ఈ బహిరంగ సభలకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేపట్టే విధంగా ప్రణాళిక తయారు చేశారు. సీఎం సభల సందర్భంగా పార్టీ ముందస్తుగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా నాయకులతో సమన్వయం చేసుకుని బహిరంగ సభల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల పర్వాన్ని కొనసాగిస్తూనే దానికి అనుబంధంగా ప్రచారాన్ని జోడించే విధంగా కార్యచరణ రూపొందించారు.
ఈ కార్యక్రమంలో అభ్యర్ధులతోపాటు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్ లు , స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు పార్టీ నాయకులు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. తొలి రోజు జరిగిన మానుకోట సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో ఉన్నారు. 24న వరంగల్లో జరిగే సభా ఏర్పాట్లలో నాయకులు ప్రారంభించారు. వీటితో పాటు మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభ ఏర్పాట్లు , జన సమీకరణ అంశాలపై అక్కడి పార్టీ నాయకత్వం కేంద్రీకరించింది.
19 నుంచి 24 వరకు బహిరంగసభలు
19వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 19న ఉదయం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్ధి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ధాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ భారీ బహిరంగ నిర్వహించి ప్రచార ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు. 19వ తేదీ సాయంత్రం మానుకోట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ది పోరిక బలరామ్ నాయక్ ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యమవుతారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ లో సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 20వ తేదీన మెదక్ పార్లమెంట్ అభ్యర్ధి నీలం మధు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించే ర్యాలీ, సభలో పాల్గొని సాయంత్రం కర్ణాటక ప్రచారంలో పాల్గొంటారు. 21న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి చామల కిరణ్ రెడ్డి నామినేషన్ లో పాల్గొంటారు. ఈ సందర్భంగా జరిగే సభకు హాజరవుతారు. 22న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం ర్యాలీ, సభలో భాగస్వామ్యమవుతారు. 23న నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్ధి మల్లు రవి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. 24న ఉదయం జహీరాబాద్ ఎంపీ అభ్యర్ధి సురేష్ షెట్కార్ ఎన్నికల ప్రచార సభలో, సాయంత్రం వరంగల్ ఎంపీ అభ్యర్ధి కడియం కావ్య ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రస్తుతానికి వారం రోజుల కార్యక్రమం నిర్ణయించారు. రానున్న రోజుల్లో ఎఐసీసీ స్లార్ క్యాంపెయినర్లతో సమన్వయం చేసుకుని నిర్వహించే సభల్లో భాగస్వామ్యమవుతారు.
రాహూల్, ప్రియాంక హాజరుకానున్నారు. వీటితో పాటు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 50 తక్కువగాకుండా సభలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినందున ఈ మాత్రం ఏమరుపాటు ప్రదర్శించకుండా టార్గెట్ 14 ఎంపీ స్థానాలు లక్ష్యంగా ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ, సీఎం భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
పెరిగిన పొలిటికల్ హీట్
రాష్ట్రంలో గురువారం నుంచి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీలు అభ్యర్దుల ఎంపిక నుంచే పరిస్థితిని హీటెక్కించారు. ముఖ్యంగా పార్టీల నుంచి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వలసలు ప్రారంభం కావడంతో పరస్పర రాజకీయ విమర్శలతో రాజకీయవాతావరణ మార్పులు చోటుచేసుకున్నది. గత మూడు వారాలుగా సాగిన ఈ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ దాదాపు చివరిదశకు చేరింది.
కాంగ్రెస్ అభ్యర్ధుల పెండింగ్
బీఆరెస్, బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ మాత్రం 14 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ మూడు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైనందున నేడో, రేపో ఈ మూడు స్థానాల అభ్యర్ధుల పై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఆ పార్టీ నేతల నుంచి కొనసాగుతున్నాయి.