యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తొలి రోజు బ్రహ్మోత్సవాలను ప్రారంభించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తొలి రోజు బ్రహ్మోత్సవాలను ప్రారంభించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలకు ఆలయ ఈవో రామకృష్ణారావు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు నందిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు ఆధ్వర్యంలో పండిత బృందం వారికి మహదాశీర్వాచనం పలికారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 18 నిర్వహించనున్న లక్ష్మీ నరసింహ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ముందస్తుగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ సందర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల బృందం భద్రాచలం బయలుదేరారు. అక్కడ వారు ఇందిరమ్మ ఇండ్ల స్కీంను ప్రారంభించనున్నారు. అంతకుముందు యాదాద్రి సందర్శనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు హెలిపాడ్ వద్ద జిల్లా కలెక్టర్ హేమంత్ కే.జెండగే, రాచకొండ సిపీ తరుణ్ జోషి, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు స్వాగతం పలికారు.