BRS | ఎన్నికల వేళ వివాదస్పద వ్యాఖ్యలు కుక్కలతో పోల్చుతూ పల్లా వ్యాఖ్యలు కాంగ్రెస్లో బీఆరెస్ కోవర్టలంటూ బాల్క తలసాని, మర్రి కామెంట్లతోనూ గొడవ విధాత: బీఆరెస్ తొలి జాబితా ప్రకటన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నికలకు ముందు వివాదస్పదమవుతున్నాయి. వారు చేస్తున్న విమర్శలు పార్టీకి ప్రతికూలమో, అనుకూలమోగానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారుతూ రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ప్రజాప్రతినిధులుగా సహనం, సంయమనంతో వ్యవహరించి, ఆదర్శంగా, […]
BRS |
విధాత: బీఆరెస్ తొలి జాబితా ప్రకటన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నికలకు ముందు వివాదస్పదమవుతున్నాయి. వారు చేస్తున్న విమర్శలు పార్టీకి ప్రతికూలమో, అనుకూలమోగానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారుతూ రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ప్రజాప్రతినిధులుగా సహనం, సంయమనంతో వ్యవహరించి, ఆదర్శంగా, బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుంది. కానీ.. ప్రతిపక్షాలను విమర్శించే క్రమంలో అదుపు తప్పుతూ నోరుజారుతుండటం పార్టీ ఇమేజ్కు డామేజ్గా తయారవుతుందని కొందరు ఆ పార్టీ నేతలే అంటున్నారు.
బీఆరెస్ ఎమ్మెల్యేల విమర్శలు అధికార మత్తులో విచక్షణ మరిచినట్లుగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి. మొన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చుతూ, మొరగకుండా కొనిపారేసి మన దొడ్లో కట్టేశామంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. దీంతో ఆయన తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అది మరువకముందే నిన్న ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్లో మన బీఆరెస్ వాళ్లు కోవర్టులుగా చేరారని, వారిని మనమే పంపించామని, కాంగ్రెస్ వాళ్లను ఏమీ అనొద్దని చేసిన వ్యాఖ్యలు అంతే కలకలం రేపాయి. ఇదే క్రమంలో బీఆరెస్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమవుతున్నాయి.
‘నా కేడర్కు చెబితే ఒక్కడూ కూడా రోడ్ల మీద తిరగలేరు. నేను తలుచుకుంటే ఒక్కొక్కడిని కాల్చి పారేస్తాను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను. నాతో పెట్టుకుంటే మీకే మైనస్’ అన్నారు. తాను పీకిపడేస్తే మీ చేయి ఉండదంటూ హెచ్చరించారు. దమ్ము, ధైర్యముంటే రేపటి నుంచి తిరుగాలంటూ సవాల్ విసిరారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సొంత పార్టీ మంత్రి హరీశ్రావుపై చేసిన విమర్శలు ఆ పార్టీలో హాట్హాట్గా మారాయి. అంతముందు మైనంపల్లి స్థానిక విపక్ష నేతను చంపేస్తానంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో లీక్, ఆయన రేవంత్పై, బండి సంజయ్పై చేసిన విమర్శలు కూడా అంతే వివాదస్పదం అయ్యాయి.
తాజాగా హైదరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా సొంత పార్టీ గిరిజన నేత రాజేశ్బాబుపై చేసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తాజాగా గత బోనాల్లో ఏర్పాట్లు సరిగా లేవన్న గణేశ్ ఉత్సవ కమిటీ సెక్రటరీపై తలసాని చిందులు కూడా వైరల్గా మారాయి. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ధి..ప్రచార పర్వం ఊపందుకునే కొద్ది అధికార, విపక్షాల మధ్య మాటల వివాదాస్పద మాటల మంటలు మరింత ఎగిసిపడుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.