Congress
విధాత: కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్లో వెల్లడిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ వెల్లడించారు. సోమవారం గాంధీభవన్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మురళీధరన్, బాబా సిద్ధికి, జిగ్నేశ్ మేవాని హాజరయ్యారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన విధివిధానాలు, ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం వివరాలను మహేశ్కుమార్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి విధివిధానాలను, రుసుమును ఖరారు చేశామని తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించిందని చెపారు. ఈ సబ్ కమిటీ చైర్మన్ గా దామోదర్ రాజానర్సింహ, సభ్యులుగా రోహిత్ చౌదరి, మహేశ్ గౌడ్ ఉంటారని, 17వ తేదీ వరకు పూర్తి స్థాయి విధి విధానాలు ఖారారు చేసి ప్రకటిస్తామన్నారు. 18 తేదీ నుండి 25 వరకు డీడీ రూపంలో టికెట్ల కోసం దరఖాస్తు రుసుము చెల్లించి అప్లై చేసుకోవచ్చన్నారు.
టికెట్ ఆశించేవారు జనరల్ అభ్యర్థులు పదివేలు, బీసీలు ఐదువేలు, ఎస్సీ, ఎస్టీలు 2,500రూపాయల రుసుం చెల్లించాలని నిర్ణయించామన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో మరోసారి ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుందని, అప్లికేషన్లు పరిశీలించి పీఈసీలో సమర్పిస్తామని, వాటిని స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ టికెట్ ఇవ్వడం కుదరదన్నారు.
అభ్యర్థుల ఖరారులో పూర్తి స్థాయిలో సర్వేలు ఆధారం కాదని, కానీ సర్వేలు కూడా పరిగణలోకి తీసుకుంటారన్నారు. అభ్యర్థుల ఎంపికలో ప్రధాన భూమిక పీఏసీ దేనని స్పష్టం చేశారు. సరైన అభ్యర్థిని నిర్ణయించేది పీఏసీ, స్క్రీనింగ్ కమిటీ, ఆ తరువాత సీఈసీ, తరువాత సీడబ్ల్యూసీలు మాత్రమేనన్నారు. అన్ని స్థాయిల్లో పరిశీలన పిదప సెప్టెంబర్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు.