గత తొమ్మిదేళ్ల బీఆరెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధించిన వారిని పార్టీలో చేర్చుకోవడం పట్ల కాంగ్రెస్ కేడర్ భగ్గుమంది
విధాత, వనపర్తి బ్యూరో : గత తొమ్మిదేళ్ల బీఆరెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధించిన వారిని పార్టీలో చేర్చుకోవడం పట్ల కాంగ్రెస్ కేడర్ భగ్గుమంది. ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో చిన్నారెడ్డి సమక్షంలో పలువురు బీఆరెస్ కార్యకర్తలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చేరికల కార్యక్రమానికి హాజరయ్యేందుకు చిన్నారెడ్డి రంగాపురం గ్రామం వెళ్లారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇన్నాళ్లు మాపై కేసులు పెట్టి వేదించిన బీఆరెస్ పార్టీ వారిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దని వాదిస్తూ అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీలో చేరేందుకు సిద్ధమైన బీఆరెస్ కార్యకర్తలు, నాయకులకు మధ్య వాగ్వివాదం, గొడవ చెలరేగింది. చిన్నారెడ్డి ఎదుటనే గొడవ కొనసాగింది. చిన్నారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్లు సర్ది చెప్పినప్పటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినలేదు.
ఎట్టి పరిస్థితిలోనూ వారిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ అడ్డుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తల,నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని చిన్నారెడ్డికి గుర్తు చేశారు. కాంగ్రెస్లో చేరడానికి వస్తున్న వారి గురించి తెలుసుకోవాలని, వారికి ప్రజల్లో మంచి పేరుందా, లేదా అనే విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ వారిని అడిగి తెలుసుకోవాలన్నారు. అవినీతి, అక్రమాలు, దుర్వినియోగం, స్కాంలు, స్కీంల స్వాహా గురించి విచారణ చేయాలని చిన్నారెడ్డితో గొడవకు దిగారు. గత బీఆరెస్ పాలనలో అక్రమంగా కేసులు పెట్టి స్వల్పానందం పొందారని, ఇప్పుడు వారి దందాలు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని, అలాంటి వారికి ఎప్పుడు విలువలు ఉండవని, పది సంవత్సరాల కాలంలో గ్రామంలో ఉన్న నాయకుల గురించి తెలుసుకోవాలని వారు చిన్నారెడ్డికి సూచించారు. దీంతో చేసేదిలేక చిన్నారెడ్డి చేరికల కార్యక్రమాన్ని నిలిపి అక్కడ నుంచి వెళ్లి పోయారు.