Congress
విధాత: హైదరాబాద్ లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టడానికి జాగా లేదన్నసీఎం కేసీఆర్ వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. వేలంలో ఆ భూములు కొంటున్నవారు జాగ్రత్త అని, ఆలోచించి నిర్ణయం తీసుకోండని, వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, తర్వాతా వైన్స్ల టెండర్లు, భూముల వేలం, ఓఆర్ఆర్ టెండర్లు, సచివాలయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అమరవీరుల స్థూపం అన్నింటిలో అవినీతిపై సమీక్ష చేస్తామని ప్రకటించారు.
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షులు జీఎంఆర్ ఆధ్వర్యంలో అలంపూర్, దేవరకద్ర తదితర ప్రాంతాల నుంచి పలువురు సోమవారం గాంధీభవన్లో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేరిన వారికి స్వాగతం పలుకుతున్నామన్నారు.ప్రజల ఆకాంక్షల సాధనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకోవడానికి కాదని, దళితుల భూములు గుంజుకోవాలని కాదన్నారు.
సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ సంపదను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుందన్నారు. పేదలకు కాంగ్రెస్ పట్టా భూములు ఇస్తే.. అభివృద్ధి ముసుగులో బీఆరెస్ గుంజుకుంటోందన్నారు. 100కోట్లు పలికే భూములకు ఎకరానికి కోటి అయినా పేదలకు ఇవ్వాలి కదా అని, ఔటర్ పక్కన 65 వేల కోట్ల విలువైన భూమి ఉందన్నారు.
తెలంగాణలో వైన్స్లను సొంత మనుషులకు అప్పగించేందుకే వైన్ షాపులకు ముందే టెండర్లు వేశారన్నారు. పాత షాపుల లైసెన్స్ల గడువుకు నాలుగు నెలల ముందు ఎలా టెండర్లు ఇస్తారని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ వైన్స్ టెండర్లు వేస్తామన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని, సర్వేలన్నింటిలో బీఆరెస్ ఓడిపోతాయని తేలడంతో ప్రభుత్వ ఆస్తులు, భూములన్ని అమ్ముకుని విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మా వాళ్లపై అక్రమ కేసులు పెట్టించారని, మేం మహబూబ్ నగర్ వస్తే నీ వీపు చింతపండు అవుతుంది జాగ్రత్త అంటు హెచ్చరించారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, పోలీసుఅధికారులకు చెబుతున్నా రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతామని, అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామన్నారు.
కేసీఆర్ కు తన నాయకత్వంపై నమ్మకముంటే గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలని, సిటింగ్లందరికి సీట్లు ఇవ్వాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 కు 14 సీట్లు గెలిపించాలని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాదన్నారు.