Merchant Ship: కేరళ తీరంలో వ్యాపార నౌకలో పేలుళ్లు..!

Reported by: Y.V. Narsimha Reddy | latest | Jun 09, 2025, 3:13 pm IST
Read Time: 3 mins
Merchant Ship: కేరళ తీరంలో వ్యాపార నౌకలో పేలుళ్లు..!

Merchant Ship:  కేరళ ఓడరేవు సమీపంలో ఓ వ్యాపార నౌక మంటల్లో చిక్కుకుంది. నౌకలోని కంటెయినర్లలో పేలుళ్లతో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తుంది. నాలుగు నౌకలు మంటలను ఆర్పడానికి బయలుదేరాయి. రక్షణశాఖ ప్రతినిధి కథనం మేరకు సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ నౌక సోమవారం ఎంవీ వాన్‌ హై 503 కేరళ తీరానికి సమీపంలో 45మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న క్రమంలో దాని లోపల పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన నౌకాదళం ఐఎన్‌ఎస్‌ సూరత్‌ను అత్యవసర సహాయం కోసం సదరు నౌక వద్దకు తరలించారు. దీంతోపాటు నేవల్‌ స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ గరుడ్‌ నుంచి డోర్నియర్‌ విమానంతో ఆ ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టింది. 270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల పొడవున్న ఈ నౌక జూన్‌7న కొలంబో తీరం నుంచి బయల్దేరింది. ఇది జూన్‌ 10వ తేదీ నాటికి ముంబయికి చేరుకోవాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదానికి గురైంది.

ఇటీవలే లైబీరియాకు చెందిన ఎంఎస్‌సీ ఎల్సా-3 కంటైనర్ల నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో నీట మునిగింది. సమాచారం అందుకున్న ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. నౌకలోని 24మంది సిబ్బందిని రక్షించారు. అయితే చమురు, పర్నేస్‌ ఆయిల్‌తోపాటు కాల్షియం కార్బనైడ్‌ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్న కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. దీంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి..రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు.