Uttar Pradesh | ఓ యువతి తన 17వ ఏట అదృశ్యమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఓ మృతదేహం లభ్యం కాగా, ఆమె తమ బిడ్డనే అని తల్లిదండ్రులు నిర్ధారించారు. అయితే యువతిని కిడ్నాప్ చేసి చంపారని అనుమానం వ్యక్తం చేసిన తండ్రి.. ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ కేసుతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని అతని తల్లి స్పష్టం చేసింది. […]
Uttar Pradesh | ఓ యువతి తన 17వ ఏట అదృశ్యమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఓ మృతదేహం లభ్యం కాగా, ఆమె తమ బిడ్డనే అని తల్లిదండ్రులు నిర్ధారించారు. అయితే యువతిని కిడ్నాప్ చేసి చంపారని అనుమానం వ్యక్తం చేసిన తండ్రి.. ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఆ కేసుతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని అతని తల్లి స్పష్టం చేసింది. ఆమె ఎక్కడో ఒక చోట బతికే ఉందని యువకుడి తల్లి భావించింది. దీంతో తన కుమారుడిని నిర్దోషిగా నిరూపించేందుకు ఆ యువతి ఆచూకీ కోసం ఏడేండ్ల నుంచి గాలిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఇటీవలే ఆ యువతిని గుర్తు పట్టి పోలీసులకు సమాచారం అందించింది ఆ తల్లి.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని గొండా పోలీసు స్టేషన్ పరిధిలో 2015లో ఓ 15 ఏండ్ల బాలిక అదృశ్యమైంది. కొద్ది రోజులకు ఆగ్రాలోని ఓ యువతి హత్యకు గురైంది. దీంతో గొండా పీఎస్లో ఫిర్యాదు చేసిన తండ్రి.. ఆగ్రా వెళ్లాడు. హత్యకు గురైన యువతి తమ బిడ్డనే అని నిర్ధారించాడు. అయితే తమ బిడ్డను విష్ణు(ప్రస్తుతం 25 ఏండ్లు) కిడ్నాప్ చేసి, హత్య చేశాడని అతనిపై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విష్ణు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ఇక ఆ యువతి హత్యతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని తల్లి స్పష్టం చేసింది. కుమారుడిని నిర్దోషిగా నిరూపించుకునేందుకు ఆ తల్లి పరితపించింది. ఈ క్రమంలో గత ఏడేండ్ల నుంచి ఆ యువతి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉంది. ఇటీవల ఓ కార్యక్రమం నిమిత్తం యువకుడి తల్లి హాథ్రాస్ వెళ్లింది. గోండాలో అదృశ్యమైన యువతి ఆ కార్యక్రమంలో కనిపించింది. దీంతో ఆమె ఆ బాలికను దగ్గరకు తీసుకొని, పోలీసులకు సమాచారం అందించింది.
విష్ణు తల్లి కోరిక మేరకు కేసు విచారణలో భాగంగా.. యువతి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. ఆమె పేరెంట్స్ డీఎన్ఏ శాంపిల్స్ ను కూడా సేకరించి పరీక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఒక వేళ డీఎన్ఏలు సరిపోలితే విష్ణు విడుదలకు మార్గం సుగమం అయినట్టే. ఏడేండ్లుగా విష్ణు తల్లి చేసిన ప్రయత్నం ఫలించనుందా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.