విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ ఎన్నికల మ్యానిఫెస్టోల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. మ్యానిఫెస్టోల విడుదలకు ముందే పోటాపోటీగా ఎన్నికల వరాలు గుప్పిస్తున్నాయి. ఎదుటి పార్టీ రెండిస్తే మేం నాలుగిస్తాం అన్నట్లుగా సాగుతున్న ఎన్నికల వరాలు ఒకరకంగా అర్రాస్ పాటనే తలపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి నంబర్ వన్.. రోల్ మాడల్ అని చెప్పుకొంటున్న అధికార బీఆరెస్ కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు.. డిక్లరేషన్ల ధాటికి మరిన్ని జనాకర్షక పథకాలకు రూపకల్పన చేయక తప్పడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ తమ ఎన్నికల ప్రణాళిక అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం వంటి పథకాలున్నాయని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
ఇదే రీతిలో ప్రభుత్వంలో కీలక ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్రావు.. ఈ దఫా తమ ఎన్నికల మ్యానిఫెస్టో కాంగ్రెస్, బీజేపీలకు దిమ్మ తిరిగేలా ఉంటుందని, నూతన సంక్షేమ పథకాలతో అద్భుతమైన మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్నామని చెప్పడంతో సహజంగానే బీఆరెస్ మ్యానిఫెస్టోపై ఫోకస్ పెరిగింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ కే కేశవరావు సారథ్యంలో రాజకీయ, ఆర్థిక రంగాల నిపుణులు, రిటైర్డ్ ఐఏఎస్లు, ప్రొఫెసర్ల బృందంతో కలిసి బీఆరెస్ మ్యానిఫెస్టో రూపకల్పనకు మేధో మథనం సాగిస్తున్నారని సమాచారం. వారితో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 6వ తేదీ తర్వాత ఏ క్షణాన్నైనా వెలువడే అవకాశముండటంతో కొత్త పథకాలను వెంటనే ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు పీఆర్సీ, 5 శాతం మధ్యంతర భృతిని ప్రకటించేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఇదే రీతిలో దసరాకు ప్రారంభించాలనుకున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ఈ నెల 6వ తేదీనే ప్రారంభించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. 4 లక్షల మందికి గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 5వ తేదీకల్లా ఫైనల్ చేయనుంది. ఇప్పటిదాకా తమ సంక్షేమ పథకాలలో లోటుగా ఉన్న అంశాలను నూతన మ్యానిఫెస్టోలో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఆక్టోబర్ 16న వరంగల్ సభలో బీఆరెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. పార్టీ మ్యానిఫెస్టోలో ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు తోడుగా నాలుగైదు కొత్త పథకాలను ప్రకటించవచ్చని బీఆరెస్ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు తదిర సంక్షేమ పథకాలకు తోడుగా ఇప్పటిదాకా పథకాలు అందని రైతు కూలీలు, కౌలు రైతులకు కూడా ఈ దఫా మ్యానిఫెస్టోలో పథకాలు ప్రకటిస్తే ఎన్నికల్లో ప్రయోజనకరంగా ఉంటుందని బీఆరెస్ తలపోస్తున్నదని సమాచారం.
రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్లకు ప్రత్యామ్నాయంగా తెల్ల రేషన్ కార్డు పేదలకు హెల్త్ కార్డు రూపకల్పన చేయబోతున్నట్లుగా పార్టీ వర్గాల కథనం. తద్వారా సుమారు 90 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తున్నదని చెబుతున్నారు. అలాగే రైతుబంధు ఎకరా సహాయ మొత్తంను 5వేల నుంచి 6వేలకు పెంచుతారని, కల్యాణ లక్ష్మిని 1లక్ష 116 నుండి 1,25,116 కు పెంచవచ్చని తెలుస్తున్నది. ఇప్పటికే వికలాంగులకు పింఛన్ 4,116 పెంచగా, ఆసరా పింఛన్ వయసు 57 ఏళ్లకు తగ్గించారు. ఆసరా పింఛన్ను 2,116 నుంచి 3,116కు పెంచాలని భావిస్తున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు గ్యాస్ రాయితీ కింద ఆరు సిలిండర్లను అందించాలని, ఇప్పటిదాకా తమ ప్రభుత్వంలో సాయం దక్కని రైతు కూలీలు, కౌలు రైతులకు కొత్త స్కీమ్ ప్రకటిస్తారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్, 3,116 రూపాయల నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం, పేపర్ల లీకేజీ, పరీక్షల రద్దులతో అసంతృప్తితో ఉన్న యువతను ఆకట్టుకునేందుకు కూడా పథకాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంది.
కసరత్తులోనే బీజేపీ మ్యానిఫెస్టో
బీజేపీ మ్యానిఫెస్టో అంశాలు ఇప్పటిదాకా వెల్లడికాకపోయినా ఆ పార్టీ యంత్రాంగం ఎన్నికల మ్యానిఫెస్టో కసరత్తు ప్రక్రియలో ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి వెల్లడించారు. అయితే ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనల సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం, పలు పెండింగ్ పథకాలకు శంకుస్థాపనలు, కొత్త హామీలను ప్రకటిస్తుండటం బీజేపీ ఎన్నికల హామీల పరిధిలోనే చూడాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా విస్తరించడం, జాతీయ రహదారులు, రైల్వే లైన్ల విస్తరణ పథకాలు ఎన్నికల వరాలలో భాగంగానే బీజేపీ ప్రచారం సాగిస్తున్నది. నిజామాబాద్ మోదీ పర్యటనలో ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, బస్తీ దవాఖానాలు, క్రిటికల్ హెల్త్కేర్ యూనిట్లు, హైవేలు, రైల్వే లైన్ల ప్రకటన బీజేపీ ఎన్నికల ప్రచార అంశాలుగా మారాయి.
ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ జోరు
కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారంటీలు, యూత్, రైతు డిక్లరేషన్లతో జోరుమీదుంది. మైనార్టీ, బీసీ డిక్లరేషన్లతో పాటు పూర్తి స్థాయి ఎన్నికల మ్యానిఫెస్టో రావాల్సివుంది. ఎమ్మెల్యే డీ శ్రీధర్బాబు నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కసరత్తు సాగుతున్నది. రైతు భరోసాలో రైతులు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు 15,000, రైతు కూలీలకు 12,000, వరికి 500 బోనస్ ప్రకటించింది. 15000 పథకానికి మార్గదర్శకాలు ప్రకటించలేదు. ఎంత భూమి ఉన్నా 15000 ఇస్తారా? ఎకరాల మేరకు ఇస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. మహాలక్ష్మికి పథకంతో పేద మహిళలకు 2,500 సహాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి, చేయూత పేరుతో 4వేల పింఛన్, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వైద్య వసతి, గృహజ్యోతి పథకంతో పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పేదలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, అమరులకు 250 గజాల ఇంటి స్థలం హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. యువ వికాసం పేరుతో విద్యార్థులకు 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు హామీలనిచ్చింది. రైతులకు 2లక్షల రుణమాఫీ ప్రకటించింది. వీటికి తోడు విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్, ఆటో డ్రైవర్లకు, కల్లుగీత కార్మికులకు సంక్షేమ పథకం రూపకల్పన చేస్తున్నారు.
బడ్జెట్కు రెండింతలుగా పథకాల వ్యయం
2023-24 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2.90 లక్షల కోట్లుగా ఉంది. వచ్చే ఏడాది 3.15 లక్షల కోట్ల మేరకు పెంచవచ్చనుకుంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు, డిక్లరేషన్లకు లేదా బీఆరెస్ ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా ప్రకటించనున్న పథకాలకు సగం బడ్జెట్ పోతుంది. మిగిలిన లక్ష కోట్లు సగం ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ పాలనా కార్యాలయాల నిర్వాహణల చెల్లింపులకు పోనుంది. అటు ఇటుగా మరో 50వేల కోట్ల వరకు ఉండే నిధుల్లో ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు సరిపడే పరిస్థితి లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం 5లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోగా, ఎన్నికల తీరం చేరేందుకు పోటాపోటీగా పార్టీలు ప్రకటిస్తున్న జనాకర్షక, ఉచిత పథకాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారనుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.