E- insurance : ఇకపై ఈ-ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ‘బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI)’ కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పాలసీలను డిజిటలైజేషన్ చేయడాన్ని IRDAI తప్పనిసరి చేసింది. అంటే ఇకపై అన్ని బీమా సంస్థలూ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే (E- insurance) పాలసీలను అందించాల్సి ఉంటుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమా ఇలా అన్ని బీమా పాలసీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజైన ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఏమిటి ఈ ఈ-ఇన్సూరెన్స్?
ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ (EIA) అనే ఆన్లైన్ ఖాతాలో బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ చేస్తారు. ఈ ఖాతా సాయంతో పాలసీదారులు బీమా ప్లాన్లను ఆన్లైన్లోనే యాక్సెస్ చేయవచ్చు. దాంతో వాటి నిర్వహణ మరింత సౌకర్యంగా మారుతుంది. బీమా పాలసీలకు ఆదరణ పెరుగుతున్న వేళ.. వీటి వినియోగాన్ని సులభతరం చేయాలని ఐఆర్డీఏఐ భావిస్తోంది.
ప్రయోజనాలు ఇవే..
అన్ని బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మారిస్తే.. ఈ-ఇన్సూరెన్స్ ఖాతా (EIA) ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇది పూర్తిగా పేపర్ రహితం, ఆన్లైన్లో ఉంటుంది కనుక డాక్యుమెంట్లు పోగొట్టుకున్నా తిరిగి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ కాపీలతో పోలిస్తే పత్రాలు కోల్పోయే ప్రమాదం తక్కువ. పాలసీ వివరాలు, రెన్యువల్ తేదీలను ఈజీగా ట్రాక్ చేయవచ్చు. పాలసీలో చిరునామా మార్చాలన్నా, వివరాలు అప్డేట్ చేయాలన్నా ఈ-ఇన్సూరెన్స్తో చాలా సులభం. అంతేగాక పాలసీల డిజిటలైజేషన్తో బీమా సంస్థలు, పాలసీదారుల మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. దీంతో క్లెయిమ్ల ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఇక బీమా తీసుకున్న వ్యక్తికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.