Rythubadi | రైతాంగానికి మార్గదర్శి.. రైతుబడి: మంత్రి నిరంజన్‌రెడ్డి

Rythubadi | భావి ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమే వ్యవసాయానికి ప్రత్యామ్నాయం లేదు రైతుబడి మాస పత్రిక ఆవిష్కరణలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతుబడి సమాచారం ఔత్సాహిక రైతులకు స్ఫూర్తిదాయకం విధాత: భావి ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని, వ్యవసాయానికి భూమిపై ప్రత్యామ్నాయం లేదని, మునుముందు వ్యవసాయానికి మరింత ప్రాధాన్యత దక్కబోతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ మెగా ఈవెంట్ […]

  • Publish Date - August 26, 2023 / 12:21 PM IST

Rythubadi |

  • భావి ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమే
  • వ్యవసాయానికి ప్రత్యామ్నాయం లేదు
  • రైతుబడి మాస పత్రిక ఆవిష్కరణలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • రైతుబడి సమాచారం ఔత్సాహిక రైతులకు స్ఫూర్తిదాయకం

విధాత: భావి ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని, వ్యవసాయానికి భూమిపై ప్రత్యామ్నాయం లేదని, మునుముందు వ్యవసాయానికి మరింత ప్రాధాన్యత దక్కబోతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ మెగా ఈవెంట్ కు హాజరైన నిరంజన్‌రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజావరప్రసాద్ రావులతో కలిసి రైతు బడి డిజిటల్ మాస పత్రికను, రైతుబడి గేయాన్ని ఆవిష్కరించారు.

రైతుబడి యూట్యూబ్ ఛానల్ అధినేత రాజేందర్ రెడ్డితో పాటు ఉత్తమ రైతులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతికత ఎంత పెరిగినా ఆహారం వ్యవసాయం ద్వారానే వస్తుందని, దీనికి ప్రత్యామ్నాయం లేదన్నారు. రైతును మించిన అనుభవం గల శాస్త్రవేత్త ఈ భూగోళంలో లేడని, సృష్టిలో జీవులన్నింటికీ ఆహారం అవసరమని, అన్ని జీవులు భుజించిన పంట ఆఖరుకు రైతు ఇంటికి వస్తుందన్నారు. 800 కోట్ల పైచిలుకు ప్రపంచ జనాభాకు అవసరమైన ఆహారం అమెరికా, చైనా, భారత్ ల నుండే ఎక్కువ భాగం వస్తుందన్నారు.

అమెరికా, చైనాల కన్నా సాగుకు యోగ్యమైన భూమి భారత్ లో అత్యధికంగా ఉందన్నారు. భవిష్యత్ ప్రపంచ ఆహార అవసరాలు తీర్చే శక్తి భారతదేశానికి మాత్రమే ఉందన్నారు. వ్యవసాయం ఆధునిక పరిశ్రమగా ఎదిగేందుకు వ్యవసాయ అనుకూల విధానాలు కావాలన్నారు. డాలర్లు, రూపాయలు ఆహారం అందించలేవని, మానవుడు స్థిరమైన వ్యవసాయం కనుక్కుని ఆచరించడం పదివేల సంవత్సరాలు అయిందన్నారు. గత 120 ఏళ్ల కాలంలో వ్యవసాయరంగంలో అనేక మార్పులు సంభవించాయని, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశంలో తిండిగింజలకే కొరత ఉండేదని, అప్పట్లో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత రంగమన్నారు.

1963 తర్వాత వచ్చిన సస్య విప్లవం మూలంగా వచ్చిన ఎరువులు, నూతన వంగడాలతో పంటలలో దిగుబడి పెరిగిందని, భారతదేశ వ్యవసాయ పితామహుడు అంటే బాబూ జగ్జీవన్ రామ్ అనే చెప్పాలన్నారు. నేడు మనం ఆకలి ఇబ్బందుల నుండి నిల్వలు దాచుకునే వరకు వచ్చామన్నారు. కాలక్రమంలో వ్యవసాయరంగంలో రసాయనిక ఎరువులు పెరిగి అనర్థాలకు దారితీస్తున్నాయని, సహజ ఎరువుల వినియోగం పెంచాలని, మనం తినే ఆహారంలో సమతుల్యత లేక అనారోగ్యం బారిన పడుతున్నామన్నారు.

ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాల కోసం నేల ఆరోగ్యాన్ని పెంచేందుకు అందరం కృషి చేయాల్సి ఉందన్నారు. రైతు తలఎత్తుకునే పరిస్థితి లేని దుస్థితి నుండి నేడు తెలంగాణలో నేను రైతును అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని, పనిచేయని వారికి, కష్టపడని వారికి ఈ భూమి మీద తినే హక్కు లేదన్నారు. రైతుబంధు పథకం కింద పది ఎకరాల పైన ఉన్న రైతులు లబ్దిపొందుతున్నది కేవలం 1.22 శాతం మాత్రమేనన్నారు. రైతుబంధు పథకం గురించి కొందరు వ్యక్తులు, ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దేశాన్ని దోచుకుని విదేశాలకు పోయిన దొంగల గురించి వారు చర్చించరని, వార్తలు రాయరని, కానీ రైతుకు చేసిన సాయం మీద వక్రభాష్యాలు చెబుతున్నారని, ఈ ధోరణి మారాలన్నారు.

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలని, రైతాంగానికి తక్కువ ధరలో యంత్రాలు అందేలా కృషిచేయాలని శాస్త్రవేత్తలను కోరడం జరిగిందన్నారు. వ్యవసాయంలో ఊబరైజేషన్ రావాలని, రైతుకు అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచి సేవలు అందించేలా ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని 2009 నుండి కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అధికారంలోకి వస్తే ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందన్నారు.

కొత్త తరం, ఉన్నత చదువులు చదివిన వారు వ్యవసాయ రంగం వైపు రావాలి అన్న ఉద్దేశం రైతుబడి వీడియోల్లో కనిపిస్తుందన్నారు. రైతుబడి ఛానల్ నిర్వహణ ఒక ఉదాత్తమైన ఆశయమని, వ్యవసాయ విజయాలను రైతుబడి ద్వారా రాజేందర్ రెడ్డి కష్టపడి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, ఒక విశ్వవిద్యాలయం చేయాల్సిన పనులు తను చేస్తున్నాడని అభినందించారు.

రైతు మేలు కోసం రైతుబడి ఛానల్ మరింత ఆదరణ పొందాలన్నారు. రైతుబడి వీడియోలు చూస్తే ఉత్సాహం, ఉద్వేగం అనిపిస్తుందని, యూట్యూబ్ ఛానళ్లు ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడుతున్నట్లు లేవని, కానీ ఈ వ్యవసాయ యూట్యూబ్ ఛానల్ రైతుబడి రైతులకు ఎంతో ఉపకరిస్తున్నదని, ఇదే రీతిలో డిజిటల్ మాస పత్రిక కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సమాచారం.. ఆచరణతో సాగు మరింత లాభసాటి: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, మెళకువల సమాచారాన్ని తెలుసుకుని.. ఆచరించడం ద్వారా సాగును మరింత లాభసాటిగా మలుచుకోవచ్చని ఇందుకు రైతుబడి వారధిగా మారిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో వ్యవసాయం అంటే దండగ అన్న స్థితి నుండి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పండగ చేసుకున్నామన్నారు. రైతుబంధు, రైతుభీమా, సాగునీళ్లు, కరంటు, పంటల కొనుగోళ్లతో రైతుకు అండగా నిలిచారన్నారు.

రైతుకు వ్యవసాయం గురించి సమాచారం ఇవ్వడం అవసరమని, అందుకే ప్రభుత్వం ప్రతి ఐదువేల ఎకరాలకు క్లస్టర్ ఏర్పాటు చేసి, రైతువేదిక నిర్మించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించిందని అన్నారు. భూసార పరీక్షలు చేసి రైతుల నేలలను బట్టి పంటల సాగును ప్రోత్సహిస్తున్నారన్నారు. వ్యవసాయంలో సొంతంగా కష్టపడితే విజయం దక్కుతుందన్నారు.

రైతుబడి డిజిటల్ మీడియా ద్వారా రాజేందర్ రెడ్డి రైతుల విజయాలను ఇతర రైతులకు తెలియ చెబుతున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. వ్యవసాయంలో తెలియనివి తెలుసుకోవాలని, తెలిసినవి ఇతరులకు తెలియజెప్పాలని, రైతుబడి ద్వారా రైతుల విజయాలు, ఇబ్బందులను బయటకు తీసుకు రావడం కోసం రాజేందర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఔత్సాహిక రైతుల్లో స్ఫూర్తి: కట్టా శేఖర్ రెడ్డి

రైతాంగానికి రైతుబడి కార్యక్రమం మార్గదర్శిగా నిలుస్తుందని, రాజేందర్‌రెడ్డి రైతుబడి ద్వారా చేస్తున్న కృషి ఔత్సాహిక రైతుల్లో స్ఫూర్తిని రగిలిస్తుందని సమాచార శాఖ మాజీ కమీషనర్ , సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి అన్నారు. రైతుబడి సక్సెస్‌లో రాజేందర్ రెడ్డి కృషి గొప్పదన్నారు. జర్నలిస్ట్ గా బస్తర్ లో కాకతీయుల చరిత్రను బయటకు తీసుకురావడంలో తనది కీలకపాత్ర అని గుర్తు చేశారు.

రైతుబడికి పది లక్షల మంది సబ్ స్క్రైబర్లు, 88 కోట్ల వ్యూస్ రావడం అభినందనీయమన్నారు. వ్యవసాయ సమాచారం కోసం ఎంత మంది అన్వేషిస్తున్నారో దీన్ని బట్టి అర్దమవుతుందన్నారు. రైతుబడి బడిలా కాకుండా విశ్వవిద్యాలయంలా ముందుకు సాగుతుందన్నారు. మన చుట్టూ ఉన్న వ్యవసాయ పంటలు, ప్రయోగాలు, యంత్రాల గురించి చెబుతున్న వివరాలు గొప్పవన్నారు. దీనిని మరింత విస్తరించాలని, రైతులు రైతుబడిని మరింత ఆదరించిన సాగును లాభసాటిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.

https://drive.google.com/drive/folders/1wgS12yYOlv2KQ_vxBiCvXn9Ejzc4m6qB?usp=sharing

రైతుబడి వేడుక.. HD Photos కోసం పై లింక్ క్లిక్‌ చేయండి

Latest News