BRS | ఓరుగల్లు గులాబీలో అయోమయం ఆఖరి వరకు తప్పని ఉత్కంట రాజశ్యామల యాగం చేసిన రాజయ్య విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అధికార పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలతో తీవ్ర పోటీ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో తమ సీటు గ్యారెంటీ కాకుండా ఎమ్మెల్సీలు నిద్రలేకుండా చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఒకటి, రెండు మినహా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. మెజార్టీ సీట్లు […]
BRS |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అధికార పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలతో తీవ్ర పోటీ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో తమ సీటు గ్యారెంటీ కాకుండా ఎమ్మెల్సీలు నిద్రలేకుండా చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఒకటి, రెండు మినహా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. మెజార్టీ సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే దక్కుతాయని చెబుతున్నప్పటికీ ఆఖరి నిమిషం వరకు ఉత్కంట తప్పనిస్థితి నెలకొంది.
వరంగల్ పశ్చిమ, నర్సంపేట, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల సెగ్మెంట్ లలో ఎమ్మెల్సీల పోటీ తక్కువగా ఉంది. జనగామ, స్టేషన్ ఘన్ పూర్, భూపాలపల్లి, వరంగల్ తూర్పు, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో మాత్రం సిట్టింగ్ లకు ముప్పు పొంచి ఉంది. ఒక విధంగా ఈ ఎమ్మెల్సీలతో నియోజకవర్గాల్లో వర్గపోరును ఎదుర్కొంటున్నారు.
ఇది పార్టీ ఐక్యతను భంగపరుస్తుండగా, అధిష్టానానికి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరొకరిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. ఈ కారణం తాజా ఎమ్మెల్యేల్లో గుబులు రేకెత్తిస్తోంది. నేడో, రేపో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తారనే వార్తల నేపథ్యంలో మరింత ఆందోళనకు లోనవుతున్నారు.
కంట్లో నలుసులా ఎమ్మెల్సీలు
ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు కంట్లో నలుసులా మారారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ పోటీ తీవ్రం చేశారు. ఎమ్మెల్సీల పేరు చెబితేనే వణికిపోతున్నారు. టికెట్ దక్కించుకునేందుకు కొందరు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉన్న నెగటివ్ అంశాలను ఏకరువు పెడుతున్నారు. అధిష్టానం తనదైన పద్ధతిలో సర్వే చేయించుకుంటూనే సిట్టింగ్ లను కాదంటే ప్రత్యామ్నాయం ఎవరని పరిశీలిస్తోంది. ఇందులో మొదటి స్థానంలో ఎమ్మెల్సీల పేర్లుంటున్నందున సహజంగా ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు.
జనగామ ఎవరి అడ్డా?
జనగామలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మొన్నటి వరకు ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాసరెడ్డి నుంచి పోటీ ఉంది. ముత్తిరెడ్డి పై పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డికి అవకాశం లభిస్తోందని భావించారు.
ఈ మేరకు ఆయన కూడా ఆ సెగ్మెంట్ పై దృష్టి కేంద్రీకరించారు. కానీ, అనూహ్యంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ముత్తిరెడ్డికి టికెట్ వస్తుందా? లేదా? అనే సంశయానికి ప్రస్తుతం పరిస్థితి చేరింది. జనగామ అడ్డా ఎవరిదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
స్టేషన్ మాస్టరెవరు?
స్టేషన్ ఘన్ పూర్ లో చిరకాల ప్రత్యర్ధులు ప్రస్తుతం ఒకే గూటిలో ఉన్నా, ఉప్పూనిప్పులా ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య నువ్వా? నేనా? అనే స్థాయిలో పోటీ జరుగుతోంది. రాజయ్య ఐదవసారి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. తనకు కడియం నుంచి ద్రోహం జరుగుతోందని మండిపడుతున్నారు.
టికెట్ దక్కి తన స్వపక్ష, విపక్ష శత్రువులు నాశనమై, తనకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా రెండు రోజుల నుంచి భద్రకాళి దేవాలయంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఇక కడియం చేరికలను ప్రోత్సహిస్తూ ఊపుమీదున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందనేది త్వరలో తేలనున్నది.
భూపాలుడెవరూ?
భూపాలపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి నుంచి తీవ్ర పోటీ ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర గులాబీ గూటికి చేరడంతో చారిసాబ్ కు పోటీ చేసే అవకాశం సన్నగిల్లింది. ఈ దఫా గండ్ర వైపు మంత్రి కేటీఆర్ మొగ్గుచూపుతుండగా కేసీఆర్ ఆశీస్సులు, స్థానికంగా బలమైన కేడర్ చారికి ఉందంటున్నారు. ఈ దఫా భూపాలుడెవరనేది చర్చసాగుతోంది.
వరంగల్ తూర్పు కింగెవరూ?
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నుంచి ముప్పు పొంచి ఉంది. చాపకింద నీరులా సారయ్య అధిష్టానం ఆశీస్సులు పొందారని చర్చసాగుతోంది. మరో వైపు మేయర్ గుండు సుధారాణి నుంచి సైతం నరేందర్ కు పోటీ ఉంది. ఇటీవల కేటీఆర్ పర్యటన సందర్భంగా టికెట్ పై గ్యారెంటీ ప్రకటించకపోవడంతో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి.
డోర్నకల్ ఎవరిదీ?
డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆఖరిసారి పోటీకి సిద్ధమవుతుండగా, ఈ స్థానం పై మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆశపెట్టుకున్నారు. రెడ్యాపై పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో ఎంపీగా ఉన్న కుమార్తె మాలోత్ కవిత పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎవరికి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందోననే ఆసక్తి ఏర్పడింది.
మాను‘కోట’ఎవరిదీ?
మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను కాదంటే టికెట్ మంత్రి సత్యవతి రాథోడ్ కుగానీ, ఎంపీ కవితకుగానీ దక్కే అవకాశాలున్నట్లు చర్చసాగుతోంది. ఇదిలా ఉండగా పరకాలలో నాగుర్ల వెంకటేశ్వర్లు, వర్ధన్నపేటలో ఎంపీ దయాకర్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం సుముఖంగా లేదని చెబుతున్నారు.