Tamil Nadu: బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష!

Tamil Nadu: బలవంతపు అప్పు వసూళ్ల నుంచి రుణగ్రహితలకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. సీఎం స్టాలిన్ ప్రభుత్వం తెచ్చిన బలవంతపు వసూళ్లకు అడ్డుకట్ట వేసే బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం రుణసంస్థలు బెదిరించి అప్పులు వసూలు చేసినా లేదా రుణగ్రహితల ఆస్తులు స్వాధీనం చేసుకున్నా.. 5 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించనున్నారు. రుణగ్రహీత బలవన్మరణానికి కారణమైతే బెయిల్ లభించని విధంగా కేసు, జైలుశిక్ష విధించేలా బిల్లు రూపొందించారు.
రుణసంస్థలు బెదిరించి అప్పులు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేలా ఏప్రిల్ 26న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టారు. శాసన సభ ఆమోదంతో గవర్నర్ వద్ధకు వెళ్లిన బిల్లుకు గవర్నర్ కూడా ఆమోదం తెలుపడంతో ఇకనైనా రాష్ట్రంలో బలవంతపు వసూళ్లకు అడ్డుకట్ట పడాలని బాధిత ప్రజలు ఆశిస్తున్నారు.