Site icon vidhaatha

Patna High Court | బలవంతంగా వాహనాల స్వాధీనం చట్ట విరుద్ధం : పాట్నా హైకోర్టు తీర్పు

విధాత: వాహన రుణాలు సకాలంలో చెల్లించని వ్యక్తుల నుంచి సదరు వాహనాలను రికవరీ ఏజెంట్ల ద్వారా బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని పాట్నా హైకోర్టు (Patna High Court) తీర్పునిచ్చింది. ఈ చర్య రాజ్యాంగం హామీ ఇచ్చిన జీవించే హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నది.

ఇటువంటి బెదిరింపు చర్యలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది. రుణాలు, బ్యాంకు రుణాలతో కొనుగోలు చేసిన వాహనాలు తదితరాలను బ్యాంకులకు ఉన్న నిబంధనల మేరకు స్వాధీనం చేసుకుని వేలం వేయవచ్చుగానీ.. రికవరీ ఏజెంట్లను పెట్టి బలవంతంగా చేయరాదని పేర్కొన్నది.

ఈ మేరకు వేర్వేరు పిటిషన్లను కలిపి విచారించిన జస్టిస్‌ రాజీవ్‌ రంజన్‌ ప్రసాద్‌ నేత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. బ్యాకులు, ఫైనాన్స్‌ సంస్థలు ఒక్కోసారి తుపాకులు చూపించి బెదిరించి మరీ బలవంతంగా వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారంటూ తప్పుపట్టింది. రికవరీ ఏజెంట్లు బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకోకుండా చూడాలని అందరు ఎస్పీలను కోర్టు ఆదేశించింది.

ఐదు కేసులలో మే 19న విచారణను ముగించిన కోర్టు.. బలవంతంగా వాహనాలను స్వాధీనం చేసుకున్న బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలకు తలా 50 వేల చొప్పున జరిమానా విధించింది. పౌరుల హక్కులకు భంగం కలిగించే ఏ అంశంపైనైనా ఏ ప్రైవేటు పార్టీ పైనైనా దాఖలయ్యే పిటిషన్లను విచారించే హక్కు హైకోర్టుకు ఉన్నదని తెలిపింది. ఇందుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించింది.

Exit mobile version