రైతుకు కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ

రైతును కాగ్రెస్ ప్రభుత్వం దెబ్బ మీద దెబ్బతీస్తుందని, అన్ని రంగాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మెగా మోసాన్ని, వంచనను తన విధానంగా మార్చుకుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

రైతుకు కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ
  • మెగా మోసం, వంచననే రేవంత్ ప్రభుత్వ విధానం
  • వంద రోజుల్లో 16,400కోట్ల అప్పులు
  • అప్పులు చేసినా రైతుబంధు ఇవ్వని ప్రభుత్వం
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి


విధాత, హైదరాబాద్ : రైతును కాగ్రెస్ ప్రభుత్వం దెబ్బ మీద దెబ్బతీస్తుందని, అన్ని రంగాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మెగా మోసాన్ని, వంచనను తన విధానంగా మార్చుకుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ మొన్నటి దాకా పంటలు ఎండిపోతున్నాపట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం లేదని విమర్శించారు. వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తమంటే రాజకీయ గేట్లు ఎత్తాం అంటున్నారని, అకాల వర్షాలతో పంటలు పోయి రైతులు బాధలో ఉంటే ఒక్క మంత్రి వారికి భరోసా ఇవ్వడం లేదని మండిపడ్డారు.


గత ఏడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్ , వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ పర్యటించి ధైర్యం కల్పించామని చెప్పారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రకారం రూ.2000 – 2500 అంచనా వేస్తే, రైతు క్షేమం కోసం ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించామని, ఒకే రోజు రూ.1300 కోట్లు విడుదల చేశామని పేర్కోన్నారు. తర్వాత మిగతా వారికి అందించామని, అప్పుడు ఎకరాకు రూ.10 వేలు బిచ్చం వేస్తున్నారా ? అని ఇదే రేవంత్ , కాంగ్రెస్ నేతలు అన్నారని గుర్తు చేశారు.


కాంగ్రెస్ నిర్లక్ష్యంతో పంటలు ఎండిన రైతులకు, అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.10 వేలు మంజూరీ చేస్తూ వెంటనే జీఓను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిజంగా కాంగ్రెస్‌కు రైతుల మీద ప్రేమ ఉంటే మా పార్టీ ప్రభుత్వం కన్నా మీరు ఎక్కువ ఇచ్చి చూపండని సవాల్ చేశారు. అదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో వేలాది ఎకరాల్లో పంటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయని తెలిపారు.


రైతుబంధు ఇవ్వరు..నీళ్లివ్వరు


కాంగ్రెస్ ప్రభుత్వం 3.5 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు ఇచ్చి 80 శాతం రైతులకు ఇచ్చామంటూ అబద్దాలు చెబుతున్నాదని, అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారని నిరంజన్‌రెడ్డి తప్పుబట్టారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని అతలాకుతలం చేస్తున్నారని ఆరోపించారు. వలస పోయిన రైతులకు గ్రామాలకు తిరిగివచ్చి వ్యవసాయం చేసే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తే.. వద్దు ఈ వ్యవసాయం అనే పరిస్థితులు కాంగ్రెస్ కల్పించిందన్నారు.


జలాశయాల్లో ఉన్న నీళ్లను అంచనా వేసి రైతుల పంటల సాగుకు సూచన చేయమంటే ఒక్కనాడు ప్రభుత్వం సమీక్ష చేయలేదని, రైతులకు నీళ్లు ఇచ్చి ప్ర గతంలో ఏమన్నా తప్పులు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండని డిమాండ్ చేశారు. కాళేశ్వరం పేరుతో గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు.


కాంగ్రెస్ చర్యలను రైతులు గమనించాలని, కాంగ్రెస్ పార్టీని నమ్మితే వచ్చిన మార్పును గమనించాలని సూచించారు. అన్ని జిల్లాల్లో రైతుల కష్టనష్టాలు, పంటలు ఎండిపోతున్న దృశ్యాలు, వార్తలు వెలువడుతున్నాయన్నారు. కానీ రాష్ట్రంలో ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే రైతుల వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపించారు.


100రోజుల్లోనే 16,400కోట్ల అప్పులు


కేసీఆర్ అప్పులు చేశాడని అభాండాలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 100 రోజులకే రూ.16,400 కోట్లు అప్పు చేసిందని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అప్పులు చేసినా రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వ లేదని ప్రశ్నించారు. గుత్తేదారులకు మాత్రం బిల్లులు ఇస్తారా ? చేసిన అప్పులతో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారు ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను ఒక్క నోటిఫికేషన్ వేయకుండా మేము ఇచ్చాం అని కాంగ్రెస్‌ చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎఓ, ఎస్ డబ్లూఓ, డీఎస్సీలో 5 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టినవేనని, కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు గత ప్రభుత్వానివేనని, వీళ్లు వచ్చి నియామక పత్రాలు ఇచ్చారని పేర్కోన్నారు.


ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని యువతకు మొండి చేయి చూపారని, గతత ఏడాది 5 వేల టీచర్ పోస్టులు ప్రకటిస్తే .. 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ అన్నారని, మరి 11 వేల ఉద్యోగాలనే ఎందుకు ప్రకటించారని నిలదీశారు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ బైక్‌లు, యువతకు నిరుద్యోగ భృతి అని అడ్డగోలుగా అధికారం కోసం హామీలు ఇచ్చారని, యువతకు కాంగ్రెస్ చేసింది మేలు కాదు మోసమని గ్రహించాలన్నారు.


కానిస్టేబుళ్ల 46 జీఓను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామన్నారని, ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, అబద్దాలతో యువతను మోసం చేశారని, నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో యువతను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, రెండు లక్షల ఉద్యోగాలలో కేసీఆర్ ప్రభుత్వం లక్ష 60 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, మిగిలిన 40 వేలు వివిధ స్థాయిల్లో ఉన్నాయని, అందులో ఉన్నవి 30 వేల ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియమకాలు ఇచ్చిందన్న వాస్తవాన్ని యువత గుర్తించాలని కోరారు.