తెలంగాణ అసెంబ్లీ ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఈ 114 మంది ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గడ్డం వివేక్(కాంగ్రెస్) అని ఏడీఆర్ తేల్చింది. రూ. 606 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 458 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. 433 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు రూ. 24 లక్షలతో అతి తక్కువ ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేగా నమోదు అయ్యారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నేనావత్ రూ. 28 లక్షలు, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ జాడే 56 లక్షలను కలిగి ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల ఆఫిడవిట్ ఆధారంగా ఏడీఆర్ ఈ రిపోర్టును విడుదల చేసింది.
2018 ఎన్నికల్లో 106 మంది కోటీశ్వరులుగా ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 114కు చేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 60 మంది, బీఆర్ఎస్ నుంచి 38 మంది, బీజేపీ నుంచి 8 మంది, సీపీఐ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి గెలిచిన ఏడుగురు కూడా కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. ఇక ఐటీఆర్ చెల్లిస్తున్న వారిలో ప్రథమస్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రెండో స్థానంలో గడ్డం వివేక్, మూడో స్థానంలో కేటీఆర్ ఉన్నారు.