Nellore | ఓ యువకుడు కామంతో చెలరేగిపోయాడు. మేనకోడలిపై ఓ మేనమామ అత్యాచారం చేశాడు. ఆ క్రూర మృగం నుంచి తప్పించుకున్న చిన్నారి బాత్రూమ్లో దాక్కుంది. కేకలు వేస్తుండటంతో.. బాత్రూమ్ డోర్ పగులగొట్టి.. చిన్నారి నోట్లో యాసిడ్ పోశాడు. విలవిలలాడిన బాధితురాలు ఐదు నెలల పాటు మృత్యువుతో పోరాడి మంగళవారం ప్రాణాలొదిలింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఇటీవలే పదవీ విరమణ పొందాడు. ఆ రిటైర్డ్ టీచర్ దంపతులకు కుమారుడు ఉండగా, అతను 18 ఏండ్ల వయసులో మృతి చెందాడు. చాలా కాలం తర్వాత మళ్లీ వారికి అమ్మాయి పుట్టింది. దీంతో ఆ పాపను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు.
అయితే గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన చిన్నారి తల్లిదండ్రులు నెల్లూరు వెళ్లారు. పాప ఒక్కతే ఇంట్లో ఉంది. ఇదే అదునుగా భావించిన మేనమామ వరుసయ్యే ఓ యువకుడు పాప వద్దకు వెళ్లాడు. ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆ కామాంధుడి నుంచి తప్పించుకున్న బాలిక.. ఇంట్లో ఉన్న బాత్రూంలో దాక్కుంది. బాత్రూం డోర్ పగులగొట్టిన ఆ కిరాతకుడు.. పాప కేకలు వేస్తుందని చెప్పి నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో పాప విలవిలలాడిపోయింది.
తీవ్ర గాయాలపాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పాపకు గత ఐదు నెలల నుంచి చికిత్స అందిస్తూనే ఉన్నారు. రెండు నెలల తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేసి, ముఖాన్ని పాత స్థితికి తీసుకువస్తామని వైద్యులు చెప్పారు. దీంతో తల్లిదండ్రులకు ఆశలు చిగురించాయి. కానీ ఆ చిన్నారి మంగళవారం ప్రాణాలొదలడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.