TSRTC | ప్రయాణికులకు శుభవార్త.. ఉచిత వైఫైతో 16 కొత్త AC స్లీపర్ బస్సులు ప్రారంభం

ప్రారంభించ‌నున్న మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ ఉచిత వైఫై సౌక‌ర్యం కూడా.. విధాత‌: ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్‌ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సు(AC Sleeper Bus)లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)(TSRTC) అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్‌ బస్సులను వాడకంలోకి తెస్తోంది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో […]

TSRTC | ప్రయాణికులకు శుభవార్త.. ఉచిత వైఫైతో 16 కొత్త AC స్లీపర్ బస్సులు ప్రారంభం
  • ప్రారంభించ‌నున్న మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్
  • ఉచిత వైఫై సౌక‌ర్యం కూడా..

విధాత‌: ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్‌ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సు(AC Sleeper Bus)లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)(TSRTC) అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్‌ బస్సులను వాడకంలోకి తెస్తోంది.

ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడపనుంది.

అత్యాధునిక హంగుల‌తో కొత్త ఏసీ స్లీప‌ర్ బ‌స్సులు

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను సంస్థ ప్రారంభించింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా నామకరణం చేసింది.

ఏసీ బ‌స్సుల‌ను ప్రారంభించ‌నున్న మంత్రి పువ్వాడ‌

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని విజయవాడ మార్గంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కొత్త ఏసీ స్లీపర్‌ బస్సుల ప్రారంభోత్సవం జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి శ పువ్వాడ అజయ్‌ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు.

కొత్త ఏసీ స్లీపర్ బస్సుల్లో ఉచిత వై-ఫై సదుపాయం

తొలిసారిగా వాడకంలోకి తెస్తోన్న ఏసీ స్లీపర్‌ బస్సులకు అత్యాధునిక సాంకేతికతను జోడించడం జరిగింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయాన్ని కల్పించారు.

వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్‌ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు.

12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్‌ల‌ వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

గమ్యస్థానాల వివరాలు తెలిపేలా బస్సు ముందు, వెనక ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులుంటాయి. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్ డీఏఎస్) ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులో మంటల చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది.