Site icon vidhaatha

Shirdi Temple | సాయిబాబా భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆలయంలో ఆంక్షలు ఎత్తివేత..!

Shirdi Temple |

షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ సాయిబాబా భక్తులకు శుభవార్త చెప్పింది. భక్తులు బాబాకు పూలదండలు, ప్రసాదం సమర్పించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయంలో భక్తులు పూలు, ప్రసాదం సమర్పించే విధానంపై ట్రస్ట్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. బాబా దర్శనానికి వెళ్లే భక్తులు సాధారణంగా పూలు, ప్రసాదం తీసుకెళ్లడం ఆనవాయితీ. కరోనా మహమ్మారి సమయంలో మహారాష్ట్రలో భారీగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చాలా రోజుల పాటు షిర్డీ ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు.

వైరస్‌ ఉధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత దర్శనాలకు అనుమతి ఇవ్వగా.. పూలు, ప్రసాదం సమర్పణపై దేవస్థానం ట్రస్ట్‌ ఆంక్షలు విధించింది. వాస్తవానికి షిర్డీ బాబా ఆలయాన్ని నమ్ముకొని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గులాబీలు తదితర పూలను సాగు చేస్తుంటారు.

దాదాపు 400 ఎకరాల్లో పూల సాగు జరుగుతుంటుంది. బాబా దర్శనానికి పూలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో తాము భారీ నష్టపోతున్నామని, ఆంక్షలు ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన సైతం తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకునేందుకు వీలుగా మహారాష్ట్ర మంత్రి, అప్పటి జిల్లా మెజిస్ట్రేట్‌ అధ్యక్షతన కమిటీని నియమించారు.

ఈ కమిటీ భక్తులతో పాటు వైద్య అధికారులు, వ్యాపారులు, ఆలయ పాలకవర్గం అభిప్రాయాలు సేకరించింది. ఈ క్రమంలోనే గతంలో విధించిన ఆంక్షలను సడలించాలని నిర్ణయించారు. కమిటీ సిఫారసుల మేరకు గతంలో మాదిరిగానే పూలదండులు, ప్రసాదం స్వీకరించనున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు సంస్థాన్‌ ట్రస్ట్‌ తమ నిర్ణయాన్ని ఆమోదించాలని కోర్టులో సివిల్‌ దరఖాస్తును దాఖలు చేసి కోర్టు నుంచి అనుమతి తీసుకున్నది. చాలా రోజుల తర్వాత బాబా దర్శనానికి వెళ్లే భక్తులు ఆలయ పరిసరాల్లో విక్రయించే పూలను కొనుగోలు చేసి సాయినాథుడికి సమర్పించే అవకాశం కలుగుతున్నది.

Exit mobile version