రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఆమోదించకుండా తిరస్కరించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాజకీయ నేతలను సిఫారసు చేయొద్దని గవర్నర్ బీఆర్ఎస్ పార్టీకి సూచించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అనే ఇద్దరు వ్యక్తులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదని గవర్నర్ పేర్కొన్నారు. అర్హులను సిఫారసు చేస్తే ఆమోదిస్తానని చెప్పారు.
మన రాష్ట్రంలో చాలా మంది వివిధ రంగాల్లో ప్రముఖలు ఉన్నా.. వారిని పరిగణలోకి తీసుకోలేదని గవర్నర్ పేర్కొన్నారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని.. అలా చేయడం ఆర్టికల్ 171 (5)కి విరుద్దం అని ముఖ్యమంత్రికి, కేబినెట్కు సూచించారు. దాసోజు శ్రవణ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ రంగంలోనూ దాసోజు శ్రవణ్ అచివ్మెంట్స్కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించలేదని పేర్కొన్నారు. సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక రంగం, సహకార ఉద్యమం, సామాజిక సేవలో ఎలాంటి ప్రత్యేకతలు లేవు అని గవర్నర్ స్పష్టం చేశారు.