High Court
హైదరాబాద్, విధాత : టీచర్ల బదిలీలపై ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టీచర్లు పెండ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామనే నిబంధనలు పెట్టడం ఎంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి నిబంధనలు కూడా ఉంటాయా అని నిలదీసింది. బదిలీల ప్రక్రియలో ఏ ప్రతిపాదికన వివక్ష చూపిస్తున్నారని రాష్ర్ట సర్కార్ను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
టీచర్ల బదిలీలపై దాఖలైన పిటిషన్పై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, న్యాయమూర్తి వినోద్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. భార్యాభర్తలు ఒకేచోట ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అదనపు అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కూడా ఇచ్చినట్టు తెలిపారు.
బదిలీలకు సంబంధించి నిబంధనలను సవరించామని, వాటిని అసెంబ్లీ, కౌన్సిల్ ముందు ఉంచినట్లు తెలిపారు. అనంతరం నిబంధనల మార్పులపై ఏజీ కోర్టుకు మెమోను సమర్పించారు. స్టే ఉన్నందున బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోరారు.
ప్రభుత్వ తరుఫు న్యాయవాది ఈరోజే మెమో, కౌంటర్లు దాఖలు చేసినందున తమకు కొంత సమయం కావాలని పిటిషర్ల తరుఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.