Karnataka | ప్రతి విద్యాసంస్థలోనూ పీఠికను చదివి తీరాలి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలోని ప్రతి పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీల్లో రాజ్యాంగ పీఠికను చదవడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించామని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలు ఏమైనా సరే ఈ నిర్ణయాన్ని తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అదే విధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ రాజ్యాంగ పీఠికను అంటించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని తెలిపింది. ఈ నిర్ణయాలపై సంక్షేమ శాఖ […]
Karnataka |
రాష్ట్రంలోని ప్రతి పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీల్లో రాజ్యాంగ పీఠికను చదవడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించామని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలు ఏమైనా సరే ఈ నిర్ణయాన్ని తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అదే విధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ రాజ్యాంగ పీఠికను అంటించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని తెలిపింది.
ఈ నిర్ణయాలపై సంక్షేమ శాఖ మంత్రి హెచ్సీ మహదేవప్ప మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని, రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలను ప్రతి విద్యార్థి తెలుసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ ఇది తప్పనిసరని స్పష్టం చేశారు.
రోజూ పీఠికను చదవడం వల్ల నవ భారత నిర్మాణంలో పాలుపంచుకోడానికి ప్రతి విద్యార్థి ఉత్తేజితుడవుతాడని, అందరి పట్ల సోదరభావం వికసిస్తుందని మహదేవప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. మనది గొప్ప రాజ్యాంగం కాబట్టి పిల్లలందిరి చేతా దాని సారమైన పీఠికను తప్పనిసరిగా చదివేలా చేస్తున్నామన్నారు.
మరో వైపు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్నింటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆరో తరగతి నుంచి 10 వ తరగతి వరకు గత భాజపా ప్రభుత్వం తొలగించిన వాటిని చేర్చుతామని, చేర్చిన వాటిని తొలగిస్తామని కర్ణాటక పాఠశాల విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. దీంతో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు బలిరాం హెగ్డేవార్, సావర్కర్ల పాఠాలు పాఠ్యపుస్తకాల నుంచి కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్ల జీవిత చరిత్రలను చేర్చుతారని తెలుస్తోంది.