Karimnagar కొనుగోళ్లు లేక మిన్నంటిన రైతుల నిరసనలు ఇసుక తరలింపుకు లారీలు ఉంటయి.. ధాన్యానికి ఉండవా అని ఆగ్రహించిన రైతులు ప్రభుత్వ రైతు దినోత్సవ వేడుకలకు ధాన్యం కొనుగోళ్ల సెగ కొన్నిచోట్ల రైతు వేదికలకు తాళం వేసిన రైతులు మరి కొన్ని చోట్ల రైతు దినోత్సవ వేడుకలు బహిష్కరించిన రైతులు ప్రధాన రహదారిపై బస్సు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన రైతు పలుచోట్ల రహదారులపై రైతుల రాస్తారోకోలు విధాత బ్యూరో, కరీంనగర్: రోహిణి కార్తె.. రైతులు నార్లు […]
Karimnagar
విధాత బ్యూరో, కరీంనగర్: రోహిణి కార్తె.. రైతులు నార్లు సిద్ధం చేసుకోవాల్సిన తరుణం.. అయితే రబీలో పండించిన పంట కొనుగోళ్ళు ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో, పండించిన పంటను అమ్ముకోడానికే వారు నానా అవస్థలు పడుతున్నారు. పంట చేతికి వచ్చి 45 రోజులు గడుస్తున్నా, కొనుగోళ్లు జరగకపోవడంతో కల్లాల వద్ద, ఐకెపి కేంద్రాల వద్ద ధాన్యపు రాశులు కానవస్తున్నాయి. దీంతో సహనం నశించిన రైతులు ఆందోళన బాట పడుతున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం శనివారం రైతు దినోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టింది. కొనుగోళ్లు లేక అసలే ఆందోళనతో ఉన్న రైతులు ఇటు అధికారులకు,
అటు ప్రభుత్వానికి చుక్కలు చూపారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఓ రైతు ట్రాక్టర్ నిండా ధాన్యాన్ని తీసుకువచ్చి, క్యాంప్ కార్యాలయంలో పారబోసి నిరసన తెలిపారు. ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సట్టం శెట్టి రాజన్న మంత్రికి రైతుల కష్టం తెలియాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డారు.
క్యాంప్ ఆఫీసులో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. గత 45 రోజులుగా ఎదురుచూస్తున్న తాను పండించిన ధాన్యం కొనుగోలు చేసేవారే లేరంటూ రాజన్న ఈ సందర్భంగా ఆరోపించారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కింద పారబోసిన ధాన్యాన్ని తీసి, ట్రాక్టర్లలో పోసి, ధాన్యంతో సహా పోలీస్ స్టేషన్ తరలించారు.
చందుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు రాజు ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వేములవాడ- కోరుట్ల ప్రధాన రహదారిపై వెళుతున్న ఆర్టీసీ బస్సుకు అడ్డంగా కూర్చున్నారు. పోలీసుల జోక్యంతో అరగంట తర్వాత ఈ రైతు శాంతించడంతో బస్సు ముందుకు కదిలి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అధికార పార్టీ నేతలు రైతు దినోత్సవం కోసం రైతు వేదికల వద్ద ఏర్పాటు చేస్తే, ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో రైతులు ధాన్యం కొనుగోలులో జాప్యానికి నిరసనగా రైతు వేదికకు తాళం వేసి,
వేదిక ఎదుట ఆందోళన చేపట్టారు.
కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రైతు వేదిక సభలను రైతులు బహిష్కరించారు. తాము పండించిన వరి ధాన్యం ఐకెపి కేంద్రాలకు తరలిస్తే, లారీల కొరతతో ధాన్యాన్ని లోడ్ చేయడం లేదని వారు ఆరోపించారు. లారీల కొరతతో ధాన్యం ఐకెపి కేంద్రాలలోనే కుప్పలుగా పడి ఉంటుందని వారు చెప్పారు. లారీల కొరతను ఆసరాగా తీసుకొని ప్రతి బస్తాకు ఐదు రూపాయల చొప్పున చెల్లిస్తే ధాన్యం లోడ్ చేసి తరలిస్తున్నారని వారు విమర్శించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో రైతులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అంతులేని నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వారు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఈ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎందుకని వారు నినాదాలు చేశారు.
ఇదే మండలంలోని మల్యాల గ్రామంలో వేములవాడ, కోరుట్ల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. తాము పండించిన వరి ధాన్యం 45 రోజులుగా కొనుగోలు లేక కల్లాల వద్దే ఉందని వారు తెలిపారు.
అకాల వర్షాల వల్ల ఇప్పటికే తాము నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన సింగిల్ విండో చైర్మన్ తో రైతులు వాగ్వివాదానికి దిగారు.
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయి పేట గ్రామ క్వారీ వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన లారీలను స్థానికులు అడ్డుకున్నారు. రైతుల ధాన్యం తరలించడానికి లారీల కొరత ఉంటే, ఇసుక రవాణాకు పెద్ద సంఖ్యలో లారీలు ఎక్కడి నుండి వస్తున్నాయని వారు నిలదీశారు. ప్రభుత్వానికి ఇసుక రవాణా పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేకుండా పోయిందని ఆరోపించారు.