Site icon vidhaatha

BS Yediyurappa। యడ్యూరప్పకు కీలక పదవి? ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ఎత్తు!

BS Yediyurappa । బీఎస్‌ యడ్యూరప్ప! కర్ణాటక బీజేపీలో కురు వృద్ధ నేత.. బీజేపీకి ఓట్లు తెచ్చి పెట్టగలిగే అతి పెద్ద నాయకుడు! మొన్నామధ్య బీజేపీ అధిష్ఠానం ఆయనతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించింది. దీనికి తోడు ఇటీవలే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు. అయితే ప్రస్తుతం కర్ణాటక(Karnataka) లో బీజేపీ గెలుపు అవకాశాలు అంత గొప్పగా ఏమీ లేవనే వాదన గట్టిగానే వినిపిస్తున్నది.

ఈ నేపథ్యంలో అగాథం పూడ్చుకునేందుకు యడ్యూరప్పను బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ (BJP’s election campaign committee) సారథిగా నియమిస్తారనే వాదన వినిపిస్తున్నది. యడ్యూరప్పతోనే లింగాయత్‌ (Lingayat community) ల ఓట్లు సాధించడం వీలవుతుందనే భావనలో పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తున్నది.

సహజంగా బీజేపీలో రాష్ట్ర నాయకత్వానికి పెద్దగా ప్రచారం కల్పించరనే వాదన ఉన్నది. మోదీ, షా ద్వయం అన్నీ సాధించి పెడుతుందని, లోకల్‌ నాయకత్వం పాత్ర పెద్దగా ఏమీ ఉండదని అంటుంటారు. కానీ.. కర్ణాటకలో పరిస్థితి ఆశాజనకంగా లేదని తేలిపోవడంతో మళ్లీ యడ్యూరప్పను పనిగట్టుకుని కీర్తించే పని దిగ్విజయంగా కొనసాగుతున్నదని పరిశీలకులు అంటున్నారు.

రెండు రోజుల క్రితం శివమొగ్గ (Shivamogga) పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సైతం యడ్యూరప్పపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రశంసలకు యడ్యూరప్ప ఉద్విగ్నతకు కూడా గురయ్యారు. కర్ణాటకకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పను సన్మానించడమే కాకుండా.. ఆయనకు గౌరవ సూచకంగా సభికులంతా మొబైల్‌ ఫోన్‌లో టార్చ్‌ వెలిగించాలని కోరారు కూడా.

దీనికి సభికులు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. యడ్యూరప్ప ప్రసంగం ముగియగానే మోదీ లేచి నిలబడి అభినందనలు కూడా తెలియజేశారు. ఇవన్నీ మళ్లీ యడ్యూరప్పను ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైన స్థానంలో నిలబెట్టాలని బీజేపీ అనుకుంటున్ననేందుకు సంకేతాలని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గత వారం ఒక ఎన్నికల సభలో మాట్లాడిన హోం మంత్రి అమిత్‌ షా (Union Home Minister Amit Shah) సైతం మోదీ, యడ్యూరప్పలపై నమ్మకం ఉంచి బీజేపీకి ఓటు వేయాలని కోరడం యడ్యూరప్పకు కర్ణాటకలో ఉన్న ఫాలోయింగ్‌ కారణమని అంటున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప 2021 జులైలో కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు. వయోభారం వల్ల ఆయనను తప్పించారని కొందరు, కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చే క్రమంలో మార్పు జరిగిందని కొందరు బీజేపీ నేతలు చెప్పారు.

ఏది ఏమైనా ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం ఎంత తప్పో ప్రస్తుతం బీజేపీ నాయకత్వానికి అర్థమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు కర్ణాటక మళ్లీ గెలవడం కష్టమేనన్న అభిప్రాయాలు వస్తుండటంతో మరో మార్గం లేక యడ్యూరప్పను పక్కనపెట్టే సాహసం బీజేపీ చేయలేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Exit mobile version