KTR Districts Tour: కేటీఆర్.. జిల్లాల బాట!
బీఆర్ఎస్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో పార్టీ నాయకత్వం ముందుకు సాగుతోంది. సిల్వర్ జూబ్లీ సంబరాల సన్నాహాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా, జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.

KTR’s tour of districts : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబరాల సన్నాహాల నేపథ్యంలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట జిల్లా పర్యటనతో కేటీఆర్ తన జిల్లాల పర్యటన ప్రారంభిస్తారు. 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాల అనంతరం అసెంబ్లీ సమావేశాల ముగిశాక వరుసగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. బీఆర్ఎస్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో పార్టీ నాయకత్వం ముందుకు సాగుతోంది. ఈ పర్యటనల్లో భాగంగా, జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వరంగల్లో లక్షలాది మంది నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.
14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు, పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ ఏర్పరిచుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల్లో మరోసారి గుర్తుచేసుకోనున్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుందని కేటీఆర్ భరోసా ఇవ్వనున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రస్తుతం తెలంగాణ ప్రజల భరోసా బీఆర్ఎస్ పైనే ఉందని, కేసీఆర్ నాయకత్వంపై మరింత నమ్మకంగా ఉన్నారని కేటీఆర్ తన జిల్లాల పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులకు స్పష్టం చేయనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు ఆయన పర్యటనలు దోహదపడనున్నాయని పార్టీ నాయకత్వం ఆశిస్తుంది. అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలును నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై కూడా చర్చించేందుకు వ్యూహాత్మక కార్యాచరణను రూపొందించనున్నారు.