MS Dhoni | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2013 సీజన్లో ఫిక్సింగ్, బెట్టింగ్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల నిషేధం సైతం ఎదుర్కొన్నది. అయితే, ఆ సమయంలో ఫిక్సింగ్పై ఐపీఎస్ అధికారి సంపత్కుమార్ నేతృత్వంలో విచారణ జరిగింది. కేసు విచారణ సమయంలో ఐపీఎస్ సంపత్కుమార్ బుకీల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో సదరు ఐపీఎస్ను విచారణ నుంచి తప్పించడంతో పాటు విధుల నుంచి తొలగించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించడంతో లంచం తీసుకున్నట్లు సాక్ష్యాలు లేవంటూ ట్రయల్ కోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో ఐపీఎస్ అధికారికి ఊరట కలిగినట్లయ్యింది. కానీ, ఐపీఎస్ అధికారి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహేంద్ర సింగ్ ధోని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు.
ఓ టీవీ చానెల్లో తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని ధోని కోర్టుకు తెలిపాడు. సదరు టీవీ చానెల్తో పాటు ఐపీఎస్పై రూ.100కోట్లకు పరువునష్టం దావా వేశాడు. అంతేకాకుండా తాను అడిగే 17 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. ధోని వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వివరణ ఇవ్వాలంటూ టీవీ చానెల్తో పాటు ఐపీఎస్ను ఆదేశించింది.
అయితే, టీవీ చానెల్ ఇచ్చిన వివరణపై మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎవరైనా ప్రముఖ క్రికెటర్పై ఏవైనా వార్తలు ప్రచారం చేసే ముందు వాటిని నిర్ధారించుకోవాలంటూ తలంటింది. ఐపీఎస్ ఇచ్చిన వివరణ సైతం ధోనికి నచ్చలేదు. వివరణలోనూ కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలున్నాయని ధోని మరోసారి కోర్టుకు తెలిపాడు. తాజాగా పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఐపీఎస్ సంపత్కుమార్కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇస్తూ జైలు శిక్ష అమలును నిలుపుదల చేసింది.