Manipur | పార్లమెంటులో మాట్లాడమని ప్రధానికి చెప్పండి: ఇండియా నేతల వినతి
Manipur | మణిపూర్లో పర్యటించాలని సూచించండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇండియా నేతల వినతి న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులో ప్రకటన చేసేలా ఒప్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రతిపక్ష ఇండియా కూటమి కోరింది. హింసతో అల్లకల్లోలం అవుతున్న మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 31 మంది ప్రతిపక్ష నేతలు బుధవారం రాష్ట్రపతిని కలుసుకుని ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. హర్యానాలోని నుహ్ జిల్లాలో […]

Manipur |
- మణిపూర్లో పర్యటించాలని సూచించండి
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇండియా నేతల వినతి
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులో ప్రకటన చేసేలా ఒప్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రతిపక్ష ఇండియా కూటమి కోరింది. హింసతో అల్లకల్లోలం అవుతున్న మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 31 మంది ప్రతిపక్ష నేతలు బుధవారం రాష్ట్రపతిని కలుసుకుని ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో తలెత్తిన మత ఉద్రిక్తతల అంశాన్ని వారు ప్రస్తావిస్తూ.. ప్రధాని కార్యాలయానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇటీవల మణిపూర్లో పర్యటించిన నేతలు కూడా రాష్ట్రపతిని కలిసినవారిలో ఉన్నారు.
‘మణిపూర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సత్వరమే పార్లమెంటులో మాట్లాడేలా, అనంతరం ఈ అంశంపై సమగ్ర చర్చ జరిగేలా ప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం’ అని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.
మణిపూర్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను సరిదిద్దటానికి ఇద్దరు భిన్న తెగలకు చెందిన ఇద్దరు మణిపురి మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని రాష్ట్రపతికి ప్రతిపక్ష కూటమి సూచించింది. ఈ సూచనను తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సుశ్మితదేవ్ చేశారు.
31 మంది ప్రతిపక్ష నేతలు సంతకాలు చేసిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అందజేశారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో మల్లికార్జున ఖర్గే, శరద్పవార్, సుదీప్ బందోపాధ్యాయ, డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా, రాజీవ్ రంజన్, డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, కనిమొళి, సంజయ్ రౌత్, రాంగోపాల్యాదవ్ తదితరులు ఉన్నారు.