Medak |
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్ లో ఆదివారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అంటూ మంత్రులు నినందించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని, తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారని, ఇది మనందరికి గర్వ కారణమని ప్రశంసించారు.
కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో అధునాతన దోభీ ఘాట్ రజకుల సౌకర్యార్థం నిర్మించినట్లు తెలిపారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.