Hyderabad Local Body MLC: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్ధికి మీర్జా రియాజ్ కు 63 ఓట్లురాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. 38 ఓట్ల మెజార్టీతో ఎంఐఎం అభ్యర్ధి గెలుపొందారు. క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశ ఎదురైంది. తమకున్న 25 ఓట్లు మాత్రమే బీజేపీకి పోలయ్యాయి. ఎంఐఎంకు చెందిన 49, కాంగ్రెస్కు చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్ధికి పోలయ్యాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్లో నిర్వహించారు.
ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్లో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు పాల్గొన్నారు. ఓటింగ్కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. 22ఏళ్లుగా వరుసగా ఏకగ్రీవమవుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఈ దఫా జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం గెలుపొందింది.
ఆ మూడు పార్టీలు ఒక్కటే : బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడినప్పటికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్న సంగతిని ప్రజలకు తెలియచెప్పడంలో విజయం సాధించామని బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న ఎంఐఎంను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దని తాను ప్రశ్నిస్తున్నానన్నారు. రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామిక వ్యవస్థలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బహిష్కరణ సమర్థనీయం కాదన్నారు. ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి అందరికీ ధన్యవాదాలని చెప్పారు. తనకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీసియో సభ్యులకు గౌతమ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.