రాష్ట్రంలో యాసంగి ధాన్యంను రైసు మిల్లర్లు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, లేదంటే బాధ్యులైన రైస్ మిల్లులు సీజ్ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు
లేదంటే రైస్ మిల్లుల సీజ్
మిల్లర్లకు మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్
దక్షిణ తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్
విధాత : రాష్ట్రంలో యాసంగి ధాన్యంను రైసు మిల్లర్లు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, లేదంటే బాధ్యులైన రైస్ మిల్లులు సీజ్ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. బుధవారం మిర్యాలగూడలో ఆయన పలు దేవాలయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మిల్లుల వద్ద ఆగి రైతుల ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు తమకు మద్దతు ధర మేరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు.
స్పందించిన మంత్రి వెంకట్రెడ్డి వెంటనే డీఎస్వోతో ఫోన్లో మాట్లాడారు.తక్కువ ధరకి ధాన్యం కొంటున్న మిల్లు యజమాన్యంపై పిర్యాదు చేశారు. గ్రేడ్ ఏ 2,203, సాధారణ రకం 2183నిర్ణగా నిర్ణయించిందని, మిల్లర్లు 1900నుంచి 2వేల వరకే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారని, అలాగే సన్న రకం ధాన్యం 2500వరకు కొనుగోలు చేయాలని వివరించారు. సన్న బియ్యాం ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న మిల్లర్లు సన్న ధాన్యానికి ఎందుకు మద్దతు ధర ఇవ్వరంటు మండిపడ్డారు.
మద్దతు ధర మేరకు ధాన్యం కొనుగోలు చేయని మిల్లర్ల మిల్లులు సీజ్ చేయాలని ఆదేశించారు. మద్దతు ధర సమస్య, మిల్లర్ల తీరుపై తాను సీఎం రేవంత్రెడ్డితో చర్చిస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. అనంతరం వెంకట్రెడ్డి మట్లాడుతూ పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వం,రైతు ప్రభుత్వమని,.రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు.
సీనియర్ మంత్రిగా మిల్లర్లను హెచ్చరిస్తున్నానని, ప్రభుత్వం మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకున్నప్పుడు రైతులకు మీరు మేలు చేయడానికి ప్రయత్నం చేయండని మిల్లర్లకు వెంకట్రెడ్డి హితవు పలికారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1నుండి తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. సుమారుగా 60నుంచి 70లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ సన్నద్దమవుతుందన్నారు. గత ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ వద్ద మోకరిల్లి కృష్ణ, గోదావరి నీళ్లను ఆంధ్రకు తరలించిందని ఆరోపించారు.
అందుకే ఇప్పుడు నీళ్ల కొరత ఏర్పడిందన్నారు. దక్షిణ తెలంగాణను మొత్తం నాశనం చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వమేనని, ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కటి పూర్తి చేయకుండా ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు కేసీఆర్ అన్యాయం చేశాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు పాశం రాంరెడ్డి, సంపత్రెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.