విధాత, వరంగల్ ప్రతినిధి: సందర్భమేదైనా సమయానుకూలంగా వ్యవహరించడం రాజకీయ పార్టీలకు వెన్నతోపెట్టిన విద్య. అసలే పార్లమెంట్ ఎన్నికల సమయం కావడంతో అభ్యర్ధి పరిచయమో? ప్రచారమో చేపట్టేందుకు ప్రయత్నించడం పరిపాటి. తాజాగా రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం అధికార కాంగ్రెస్ పార్టీ అదే పద్ధతిని అవలంభించింది. ఈద్గాల వద్ధ సామూహిక ప్రార్ధనలు నిర్వహించే ముస్లీం సొదరులను కలిసి ఈద్ ముబారక్ చెప్పినట్లు ఉంటుందీ. పనిలో పని తమ పార్టీ నుంచి ఎంపీగా పొటీ చేసే అభ్యర్ధిని కడియం కావ్యను సామూహికంగా పరిచయంచేసే పనిచేసినట్లవుతోందని భావించినట్లుంది.
రంజాన్ సందర్భంగా సురేఖతో కలిసి కావ్య రంజాన్ ఉత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈద్గాలను సందర్శించి ముస్లీంలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య, రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా వరంగల్ జెమినీ థియేటర్ వద్ద ఉన్న ఈద్గా లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరి సోదరులందరికీ మంత్రి కొండా సురేఖ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్నికల కోడ్ రావడం వల్ల ప్రభుత్వం తరుఫున సదుపాయాలు ఏమి చేయలేకపోయామన్నారు.40 రోజులు ఎంతో నిష్టతో చిన్నాపెద్ద అందరు ఉపవాసం చేసి సమిష్టిగా పండుగ నిర్వహించుకోవడం విశేషమన్నారు. మతాలకు, కులాలకు అతీతంగా రంజాన్ పండుగను జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ఒక ప్రత్యేక హోదాలో ఈద్గా కి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అల్లాను స్మరించుకునే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రంజాన్ పండుగ మన బ్రతుకులలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు.