ఈటల రాజేంద‌ర్‌కు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చింది కేసీఆరే : మంత్రి కేటీఆర్

Minister KTR | హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌( Etala Rajender ) కు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అస‌లు ఈట‌ల రాజేంద‌ర్ ఉన్నాడ‌ని హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసింది కేసీఆర్ కాదా? అని అడిగారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జ‌మ్మికుంటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. 14 నెల‌ల కింద‌ట జ‌రిగిన ఉప […]

ఈటల రాజేంద‌ర్‌కు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చింది కేసీఆరే : మంత్రి కేటీఆర్

Minister KTR | హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌( Etala Rajender ) కు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అస‌లు ఈట‌ల రాజేంద‌ర్ ఉన్నాడ‌ని హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసింది కేసీఆర్ కాదా? అని అడిగారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జ‌మ్మికుంటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

14 నెల‌ల కింద‌ట జ‌రిగిన ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించారు. రూ. 3 వేల పెన్ష‌న్ ఇస్తామ‌ని చెప్పారు. అమిత్ షాను తీసుకొస్తాం. నిధుల వ‌ర‌ద పారిస్తాం. హుజురాబాద్‌ను మార్చేస్తాం అని ఈట‌ల చెప్పారు. బండి సంజ‌య్, తాను క‌లిసి పొడిచేస్తామ‌ని చాలా మాట‌లు చెప్పారు. ఈ 14 నెల‌ల్లో ఒక్క పైసా అయినా ఢిల్లీ నుంచి వ‌చ్చిందా? మాట‌లు కోట‌లు దాటుతాయి.. చేత‌లు మాత్రం గ‌డ‌ప కూడా దాటడం లేదు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

33 మంది పోటీ ప‌డితే ఈట‌ల‌కు టికెట్ ఇచ్చింది కేసీఆర్ కాదా?

ఒక నెల రోజుల కింద‌ట ఈట‌ల రాజేంద‌ర్ ఒక‌ స్టేట్‌మెంట్ చేసిండు. కేసీఆర్ పాల‌న రాష్ట్రానికి అరిష్టం అని అన్నారు. అస‌లు ఈట‌ల రాజేంద‌ర్ ఉన్నాడ‌ని హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిచ‌యం చేసింది కేసీఆర్ కాదా? 2004 ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నుంచి 33 మంది పోటీ ప‌డితే ఈట‌ల‌కు రాజ‌కీయ అనుభ‌వం లేకున్న‌ప్ప‌టికీ, ఆశీర్వాదం ఇచ్చి టికెట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? అని అడిగారు. త‌ల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన‌ట్టు.. తండ్రి లాంటి కేసీఆర్‌ను ప‌ట్టుకుని ఆయ‌న‌ పాల‌న రాష్ట్రానికి అరిష్టం అని ఈట‌ల అంటున్నారు. రాజ‌కీయంగా వేరు ప‌డొచ్చు కానీ రాజ‌కీయంగా జ‌న్మ‌నిచ్చిన పార్టీని ప‌ట్టుకుని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడ‌టం త‌గునా అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఎవ‌రి పాల‌న ఈ దేశానికి అరిష్ట‌మో ప్ర‌జ‌లు ఒక్క‌సారి ఆలోచించాల‌ని కేటీఆర్ సూచించారు.

ఈ దేశంలో అదానీ ఒక్క‌డే బాగుప‌డ్డ‌డు

ఎన్నో మాట‌లు చెప్పి మోదీ 2014లో అధికారంలోకి వ‌చ్చారు. 2022 నాటికి ఇల్లు లేని పేద‌వారంద‌రికీ ఇండ్లు ఇస్తానని చెప్పారు. జ‌న్ ధ‌న్ ఖాతాల్లో రూ. 15 ల‌క్ష‌లు వేస్తామ‌న్నారు. కానీ చివ‌రికి ప్ర‌జ‌ల సొమ్మునంతా ఒక్క‌డి ఖాతాలోనే మోదీ వేశాడు. ఈ దేశంలో అదానీ ఒక్క‌డే బాగుప‌డ్డ‌డు. మోదీ ప్ర‌భుత్వం పేద‌ల‌ను కొట్టి పెద్ద‌ల‌కు పంచుతోంద‌ని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మోదీ ఎవ‌రికి దేవుడు..? ఎందుకు దేవుడు..?

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేవుడ‌ని బండి సంజ‌య్ అంటున్నార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. మోదీ ఎవ‌రికి దేవుడు..? ఎందుకు దేవుడు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు తొక్కి పెట్టినందుకా? న‌ల్ల వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ఏడాదికి పైగా చేప‌ట్టిన నిర‌స‌న‌ల్లో 700 మంది రైతులు చ‌నిపోయినందుకా..? చేనేత‌ల‌పై 5 శాతం జీఎస్టీ విధించినందుకా..? ఆకాశంలో అప్పులు, పాతాళంలో రూపాయి ఉన్నాందుకా..? ఇందుకేనా మోదీ దేవుడు? అని కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.