Minister KTR |
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ఢిల్లీ గులాంగిరికి మధ్య పోటీ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. శనివారం తెలంగాణ భవన్లో కల్వకుర్తి నియాజకవర్గం నుంచి ఉప్పల వెంకటేశ్, ఆయన అనుచరులు బీఆరెస్లో చేరగా, వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వెంకటేష్ ను గత వారమే కలిశానని, తన రాజకీయ జీవితం ఏంటి అని అడిగామని, 18 ఏళ్లకే సర్పంచ్ అయ్యాను అని చెప్పాడని, భవిష్యత్తులో ఆయనకు పెద్ద పదవి ఇస్తామన్నారు.
తలకొండపల్లికి వస్తాను మీ సత్తా చూస్తానని, పాలమూరు జిల్లాలో 14సీట్లు బీఆరెస్ గెలిచేలా పార్టీ నాయకత్వం సమిష్టిగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ఇంటింటికి సంక్షేమ పథకం ఇస్తున్నామన్నారు. పుట్టిన బిడ్డ నుంచి, వృద్ధుల వరకు అందరికీ సంక్షేమం అందుతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 76ఏళ్లయినా ఇన్నేళ్లలో ఎందుకు గత ప్రభుత్వాలు ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేదని, రైతు బంధు ఇవ్వలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నాయని, 4వేల పింఛన్, 25 గంటల కరెంట్ ఇస్తామంటున్నారన్నారని, మరివాళ్లు ఇన్నేళ్లు ఎందుకు ఇవ్వలేదంటు ప్రశ్నించారు.
ఒకాయన ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుక్కుంటున్నాడని, బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ పథకాలు కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ పథకాలు కొనసాగించాకా మీరెందుకు పీకడానికి అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అందరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని గతంలో మోడీ అన్నాడని, పడ్డయా? అంటు ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్ రైతు బంధు, పెన్షన్లు, ఇలా అనేక పథకాలు అమలు చేశారన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు ఉండాలని, ఢిల్లీ నేతల మాటలు పట్టుకుంటే మాటిమాటికీ ఢిల్లీ వెళ్లాలన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRBRS pic.twitter.com/ektx3WZTF6
— BRS Party (@BRSparty) August 19, 2023
బీజేపీ పార్టీ పని హిందు ముస్లిం మధ్య చిచ్చు పెట్టడమేనన్నారు. కేసీఆర్ ను జైలుకు పంపుతాం అన్నవాడే షెడ్డుకు పోయాడన్నారు. కేసీఆర్ను ఎందుకు జైలుకు పంపుతారని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, ఆడబిడ్డ పుడితే నగదు ఇస్తున్నందుకు జైలుకు పంపుతారా? అంటు కేటీఆర్ ఫైర్ అయ్యారు. సంపద పెంచాలి, పేదలకు పంచాలి మా నినాదమని, ప్రతిపక్షాలు మాత్రం సంపద పెంచుకొని, వెనక వేసుకోవాలి అనే తీరుగా ఉందన్నారు. సంచులు మోసి, జైల్లో చిప్ప కూడు తిన్న వ్యక్తి రేవంత్ రెడ్డి కూడా నీతులు చెబుతున్నాడన్నారు.
పీసీసీ పదవీ కూడా ఒక పదవేనా..అదేమైనా ప్రైమ్ మినిస్టర్ పదవి అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడంటు మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు అభ్యర్థులే లేరని, వీళ్లకు ఓటు ఎలా వేస్తారంటు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హాయంలో కరెంట్ కోసం కష్టపడే వాళ్ళమని, వీళ్లను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టేనన్నారు. మహబూబ్ నగర్ ను సస్యశ్యామలం చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు బాగా చెప్తుతున్నారని, కల్వకుర్తి ప్రజలు చాలా తెలివి గల వారని, వాళ్లను నమ్మకండన్నారు. మీతో పెట్టుకున్నోడు ఎవడు బాగు పడలేదని, మీ నియోజకవర్గ అభివృద్దికి మాది బాధ్యతని, పార్టీ టికెట్ ఎవరికి వచ్చిన వారికి మద్దతుగా నిలవాలి గెలిపించుకోవాలన్నారు.